హయత్నగర్, మే 28: హయత్నగర్లో శుక్రవారం డీజీపీ మహేందర్రెడ్డి పర్యటించారు. రాచకొండ సీపీ మహేశ్భగవత్, అడిషనల్ కమిషనర్ సుధీర్బాబుతో కలిసి ఆర్టీసీ బస్టాండ్, పెద్ద అంబర్పేట వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టులను పరిశీలించారు. వివిధ అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హయత్నగర్లో పోలీసులు మైక్సెట్ల ద్వారా లాక్డౌన్ నియమ నిబంధనలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసే విధానాన్ని పరిశీలించి.. అభినందించారు. సడలింపు సమయంలో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ. నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలని ప్రజలను కోరారు. ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. డీజీపీ వెంట ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ప్రీత్సింగ్, వనస్థలిపురం జోన్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్నగర్ ఇన్స్పెక్టర్ సురేందర్గౌడ్, డీఐ నాగార్జున, సిబ్బంది ఉన్నారు.