మియాపూర్ : ప్రజల సౌకర్యమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం తగు అభివృద్ధి పనులను ఎప్పటికపుడు చేపడుతున్నట్లు విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. క్షేత్రస్థాయిలో వారి అవసరాలను గుర్తిస్తూ వాటిని తీరుస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాఘవేంద్రనగర్లో ప్రజలు రోడ్డు దాటేందుకు వీలుగా రూ.96 లక్షలతో చేపడుతున్న నాలాపై కల్వర్టు నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అధికారులతో కలిసి విప్ గాంధీ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులలో ఏమాత్రం నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
నాలాల్లో పేరుకుపోతున్న వ్యర్థాలను ఎప్పటికపుడు తొలగిస్తూ నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని విప్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్థన్, ఏఈ సుభాష్, రవి, పార్టీ నేత శ్రీనివాస్ పాల్గొన్నారు.