మల్కాజిగిరి ( మెదక్) : ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri Rajasekhar Reddy ) అన్నారు. బుధవారం మల్కాజిగిరి డివిజన్ దుర్గనగర్లోని నాలా, రామకృష్ణాపురం చెరవు కట్టను, వాజ్పేయినగర్ బస్ స్టాపు వద్ద డ్రైనేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలు, బస్తీలలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాదాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు.
వరద ముంపు రాకుండా నాలాల అభివృద్ధిపనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే జరుగుతున్న బాక్స్ డ్రైన్ నిర్మాణపనులను అధికారులతో పరిశీలిస్తామని అన్నారు. బండ చెరువు నుంచి వచ్చే వరద నీటిని మళ్లించి లాలాపేట్ నాలాలో కలపడానికి గల అవకాశాలు పరిశీలిస్తానని వెల్లడించారు. రామకృష్ణాపురం చెరువు అభివృద్ధికోసం గత ప్రభుత్వం దాదాపు రూ. 80 కోట్లు మంజూరుచేసిందని గుర్తు చేశారు.
భగత్సింగ్నగర్ బస్తీ వాసులకు రోడ్డు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని, అధికారులతో సర్వే నిర్వహించి రోడ్డును ఏర్పాటు చేస్తామని అన్నారు. బాలసరస్వతినగర్లో షాదాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం సునీల్, డీజీఎం భాస్కర్, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.