బడంగ్పేట/పహాడీషరీఫ్/కందుకూరు, మార్చి 27: రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18,19 వార్డు కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, మాజీ ఎంపీటీసీ దూడల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామకాలనీకి చెందిన 100 మంది నీలి కులస్తులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసే విధంగా సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారన్నారు. గడప గడపకూ శుద్ధి చేసిన నీటిని అందించే మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి, మరోవైపు ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేసే ముఖ్యమంత్రి ఉండటం మనందరి అదృష్టమన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చొరవతో మున్సిపాలిటీ పరిధిలో వరదనీరు సాఫీగా వెళ్లడానికి కోట్లాది రూపాయల నిధులతో నాలా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. కరోనా సంక్షోభంలో కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా కొనసాగాయన్నారు. ఆరునెలల కాలంలో కేవలం శ్రీరామకాలనీలో రూ. 150 కోట్లకు పైగా నిధులతో డ్రైనేజీ, సీసీ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. దశలవారీగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతానన్నారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. తమ కాలనీ సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనునిత్యం ప్రజల్లో ఉంటూ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు శ్రీరామకాలనీ నీలి కులస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ సోషల్ మీడియా ఇన్చార్జి వాసుబాబు, టీఆర్ఎస్ నాయకుడు ఎ.మారుతి, శ్రీరామకాలనీ వాసులు పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అల్మాస్గూడ సీవైఆర్ కాలనీలో శ్రీకృష్ణ విగ్రహాలతో పాటు ఇతర విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్లు సంరెడ్డి స్వప్నా వెంకట్రెడ్డి, రామిడి మాధురి వీరకర్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలి..
ప్రతి ఒక్కరూ దైవ చింతన అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని దన్నారం గ్రామంలో జరుగుతున్న అభయాంజనేయ స్వామి దేవాలయంలో బొడ్రాయి ప్రతిష్ఠ, దెబ్బడగూడ గ్రామంలో జరుగుతున్న ఈదులమ్మ దేవాలయ వారికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, ఎస్సీ విభాగం అధ్యక్షుడు గుయ్యని సామయ్య, పార్టీ సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, సురుసాని సురేందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, కాసోజు ప్రశాంత్చారి, సర్పంచ్లు ఏనుగు శ్రావణి, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డి, కొలను విజ్ఞేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్ జంగయ్య, జిట్టె రాజేందర్రెడ్డి, మిడుదల శ్రీదేవి, శేఖర్రెడ్డి, బాల్రాజ్, ఏజీ అంజయ్యగౌడ్, సొమ్లానాయక్, సురేశ్, అంజయ్య, అశోక్ పాల్గొన్నారు.