శంషాబాద్ రూరల్, జనవరి 29 : కుల, మతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని నర్కూడ గ్రామంలోని హైదరాబాద్ బెంగాలీ స్వర్ణశిల్పి వివేకానంద కాళీమందిర్ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై గంగా హారతి ఇచ్చారు. అనంతరం ప్రధాన ఆలయంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బెంగాలీలను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం బెంగాల్లో ఉన్న కాళీమాత దేవాలయాన్ని హైదరాబాద్ శివారులో నిర్మాణం చేసి ప్రజలకు అమ్మవారి దర్శనం కల్పించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అభివృద్ధిలో నంబర్వన్ రాష్ట్రంగా నిలబెట్టారని గుర్తు చేశారు. భారత రాష్ట్ర సమితికి బెంగాలీలు ఆశీర్వాదం ఇవ్వాలని కోరారు. భారత కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత బెంగాల్కు చెందిన మహనీయులకే దక్కిందన్నారు. కాళీమాత ఆలయం వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని నిర్వాహకులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను కోరగా, నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నీరటి తన్విరాజు, మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ సుష్మారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కే చంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సతీశ్, నాయకులు రాజుముదిరాజ్, బెంగాలీ ట్రస్టు సభ్యులు శేఖర్ముదిరాజ్, టీ కుమార్గౌడ్, శివాజీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.