ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 16: సీఎం కేసీఆర్ పాలనలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ శకం సాగుతోందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు మేలు చేకూర్చే పనుల్లో రాజీ పడబోమని స్పష్టం చేశారు. తార్నాక డివిజన్ లాలాపేటలో నిర్మించనున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్కు దసరా సందర్భంగా శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరారు. తార్నాక డివిజన్ ప్రజల సంక్షేమం కోసం 800 గజాల స్థలంలో మూడు అంతస్థుల్లో అధునాతన హంగులతో మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ను నిర్మించి, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న నిర్మాణం త్వరలో పూర్తికానుందన్నారు. ఈ నిర్మాణం పూర్తై ప్రజలకు అందుబాటులోకి వస్తే నిరుపేదలు వివాహాలు, ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి మాట్లాడుతూ నగరంలో తార్నాక డివిజన్ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, కంది శైలజ, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.