కంటోన్మెంట్, సెప్టెంబర్ 6: నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సూచించారు. ఈ మేరకు అమన్ వేదిక కొవిడ్ రిలీఫ్ అండ్ కేర్ సంస్థ ఆధ్వర్యంలో సీతాఫల్మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో (నేడు)మంగళవారం మొబైల్ వ్యాక్సిన్ క్యాంపును ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను సోమవారం తన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, వ్యాక్సినేషన్ ప్రక్రియను ఇప్పటికే వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు అమన్ వేదిక కొవిడ్ రిలీఫ్ అండ్ కేర్ సంస్థలు వంటివి ముందుకొచ్చి వ్యాక్సినేషన్ క్యాంపులను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రజలందరూ స్వీయ క్రమశిక్షణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అమన్ వేదిక ప్రోగ్రాం డైరెక్టర్ నమ్రత జైశ్వాల్, ప్రతినిధులు నసీర్ సిద్ధిక్, ఖాసీం, రామారాణి, ఆశాజ్యోతితో పాటు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీగణేష్ తదితరులు పాల్గొన్నారు.