ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 3 : తార్నాక డివిజన్ను గ్రీన్ డివిజన్గా మారుస్తానని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి అన్నారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలని సూచించారు. డివిజన్లో మట్టికుప్పలు, చెత్త ఎక్కడ ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, దాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. తిరిగి చెత్త పోగు చేయకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని కోరారు. లాలాపేట ఫ్లై ఓవర్ కింద పేరుకుపోయిన చెత్త, మట్టి కుప్పలు, ఆక్రమణలను జీహెచ్ఎంసీ సిబ్బంది గురువారం తొలగించారు.
ఆ పరిసరాలను టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందితో కలిసి ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు పక్కన మట్టి కుప్పలతో పాటు రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతున్నదని అభిప్రాయపడ్డారు. ఫ్లై ఓవర్ కింద రాత్రి సమయంలో లైటింగ్ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని పలువురు స్థానికులు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నగరాన్ని గ్రీన్ సిటీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ దిశగా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.
జీహెచ్ఎంసీ సిబ్బంది పగలు, రాత్రి తేడాలేకుండా నిరంతరం పనిచేస్తున్నారని చెప్పారు. కొంత మంది అదేపనిగా భవన నిర్మాణ వ్యర్థాలు, పరుపులు, బట్టలు, ఇతర చెత్తను రాత్రి సమయంలో ఎవరూ చూడకుండా ఇక్కడ పడేస్తున్నారని, వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్రిడ్జి కింద పూర్తిగా శుభ్రం చేసి, పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు చుట్టూ ఫెన్సింగ్, కెమెరాలు, లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.