వివిధ రంగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగుల ఆవేదన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ హాజరయ్యారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగభృతి, యువ వికాసం, విద్యార్థి భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందని మండిపడ్డారు. నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరుద్యోగ జేఏసీ చేపట్టే ఉద్యమానికి బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
-కవాడిగూడ, మే 20
