సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్, ఆఫ్లైన్ ఎక్కడైనా, ఎప్పుడైనా యువతులు, మహిళలను వేధిస్తే షీ టీమ్స్కు ఫిర్యాదు చేయాలని రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ ఉషారాణి సూచించారు. జూలై నెలలో 127 ఫిర్యాదులు అందాయని, ఆయా కేసులకు సంబంధించి 50 మంది పోకిరీలకు కుటుంబ సభ్యుల సమక్షంలో గురువారం రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయం ప్రాంగణలో ఉన్న షీ టీమ్స్ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బస్టాండ్, రైల్వే, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ.. డెకాయి ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. మొదటిసారి తప్పుచేసి చిక్కిన పోకిరీలకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామని, తప్పు పునరావృతమైతే కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. జూలై నెలలో వచ్చిన ఫిర్యాదులలో వాట్సాప్ (25), ఇతర సోషల్ మీడియా యాప్స్(30), నేరుగా వేధించిన కేసులు 24 ఉండగా.. ఇతర మార్గాల ద్వారా వేధింపులపై వచ్చిన కేసులు 28 ఉన్నాయన్నారు. ఇందులో క్రిమినల్ కేసులు(18), పెటీ కేసులు 15 కాగా.. 94 కౌన్సెలింగ్ కేసులు ఉన్నాయన్నారు.
మహిళల పట్ల భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ప్రయాణ సమయాల్లో, పనిచేసే చోట వేధింపులు ఉంటే వెంటనే షీ టీమ్స్ను ఆశ్రయించాలని డీసీపీ సూచించారు. పురుషులు సాటి మహిళల పట్ల బాధ్యతగా, మర్యాదగా నడుచుకోవాలని, వారికి అండగా నిలువాలని సూచించారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో ఏసీపీ నరేందర్ గౌడ్ పాల్గొన్నారు.