సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : నగరంలో సీసీ కెమెరాల నిర్వహణ కోసం డీ-కామో (డ్రోన్స్ అండ్ కెమెరాల నిర్వహణ సంస్థ) పేరుతో అదనపు డీసీపీ/ఏసీపీ అధికారి నేతృత్వంలో కొత్త విభాగాన్ని రూపొందించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ మరమ్మతులు, ప్రాజెక్ట్లు అమలు చేయడం వంటి కార్యకలాపాలను ఈ విభాగం పర్యవేక్షిస్తుందని అన్నారు. శుక్రవారం అదనపు డీసీపీ ర్యాంకు అధికారులతో బంజారాహిల్స్లోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజా భద్రత, ఇతర పరిపాలనలకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
నగరం అంతటా స్వతంత్ర థర్పార్టీ ఆడిట్
పునర్వ్యవస్థీకరణతో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో అదనంగా రెండు జోన్లు ఏర్పడ్డాయి. డీసీపీలు లేని కారణంగా అరెస్టులు, విచారణ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు, చార్జిషీట్లు పెండింగ్లో ఉండడంతో వాటిపై దృష్టి సారించాలని ఈ సమావేశంలో సీపీ అనంద్ డీసీపీలకు సూచించారు. పునర్వ్యవస్థీకరణతో అవసరమైన వసతి, సీసీటీవీ ప్రాజెక్ట్లు, కెమెరాల స్థితి, కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఎస్హెచ్ఓలు, డీసీపీల కోసం లక్ష్యాలను నిర్ణయించడంపై చర్చించారు. డీ-కామో(డ్రోన్స్ అండ్ కెమెరాల నిర్వహణ సంస్థ) అనే కొత్త విభాగం ఇక నుంచి సీసీ కెమెరాలు, డ్రోన్ మరమ్మతులు, ప్రాజెక్ట్లు అమలు చేయడం వంటి కార్యకలా
పాలను పర్యవేక్షిస్తుందన్నారు. దీనికి అదనపు డీసీపీ లేదా ఏసీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలో నాలుగు విభాగాలుగా రూపొందించినట్లు సీపీ వెల్లడించారు. సీసీటీవీ కవరేజ్ లేని ప్రాంతాలను గుర్తించడం, ప్రస్తుతం ఉన్న కెమెరాల పరిస్థితిని తనిఖీ చేయడానికి నగరం అంతటా స్వతంత్ర థర్పార్టీ ఆడిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
యువకులతో కొత్తగా శాంతి కమిటీల ఏర్పాటు
హోలీ, షబ్ ఇ బారత్, రంజాన్, శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండుగల ముందు మతపరమైన, రౌడీషీటర్లను బైండోవర్ చేయాలని సీపీ ఆదేశించారు. ఎక్కువ మంది యువకులతో కొత్తగా శాంతి కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
సీపీఆర్పై అవగాహన అవసరం
ఫిట్కాప్ కార్యక్రమం ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని కార్యక్రమాలు ప్రారంభించాలని అన్నారు. ఇటీవల ఓ యువ కానిస్టేబుల్ ఫిట్గా ఉండి మరణించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సీపీఆర్(కార్డియో పల్మోనరీ రిససిటేషన్) విద్య యొక్క అవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని, అవగాహన పెంచుకోవాలని సూచించారు. దీంతో పాటు పెట్రోలింగ్, బ్లూ కోల్ట్ల పనితీరుతో పాటు 2023 కార్యచరణ ప్రణాళికల పురోగతిపై సీపీ ఆనంద్ చర్చించారు. ప్రతి పోలీస్స్టేషన్ పనితీరును నిశితంగా పర్యవేక్షించాలని డీసీపీలను ఆదేశిస్తూ, ప్రొటోకాల్కు కట్టుబడి ఉండాలని సూచించారు. లాక్ అప్ కస్టడీలు, హెచ్సీఎస్సీ కార్యకలాపాలు, ఈ అఫీస్ అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ విక్రమ్సింగ్ మాన్, సుధీర్బాబు, ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీ పరిమల, ఎం.శ్రీనివాసులు, డీసీపీలు పాల్గొన్నారు.
అమ్యూజ్మెంట్ లైసెన్స్ సిస్టమ్కు 1183 దరఖాస్తులు
నేర నివారణ, నేరస్థులను గుర్తించడంలో సీసీటీవీల ప్రాముఖ్యతపై ప్రజలకు మరింతగా అవగాహన కల్పించనున్నట్లు సీపీ తెలిపారు. ఆన్లైన్లో అమ్యూజ్మెంట్ లైసెన్స్ సిస్టమ్కు అపూర్త స్పందన వస్తున్నదని, గత కొన్ని వారాల్లో 1183 దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరించామని సంతృప్తి వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజల సౌకర్యార్ధం ఆన్లైన్లో ఆయుధాల లైసెన్స్లు జారీ వంటి మరిన్ని పోలీసు సేవలను విస్తరించడానికి ఐటీ సెల్కు బాధ్యతలు అప్పగించామన్నారు.