ఎల్బీనగర్, ఆగస్టు 21: బైక్పై వెళ్తున్న యువకుడి మెడకు కేబుల్ వైరు తగిలింది. దీంతో అతడు రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రకాంత్ ముదిరాజ్ (29) పదేండ్ల కిందట వచ్చి కొత్తపేట పండ్ల మార్కెట్ మెట్రో స్టేషన్ సమీపంలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చంద్రకాంత్కు భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోమవారం పిల్లలను మారుతీనగర్లోని ఎక్సెల్ స్కూల్లో వదిలిపెట్టిన చంద్రకాంత్.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ వైపు వెళ్తూ.. రోడ్డుపై కిందకు జారి ఉన్న ఫైబర్ వైరును గమనించలేదు. రోడ్డు ఖాళీగా ఉండటంతో బైక్పై వేగంగా వెళ్తున్న చంద్రకాంత్ మెడకు ఫైబర్ వైరు తగలడంతో ఒక్కసారిగా బైక్ ముందుకు వెళ్లిపోయి.. అతడు కిందపడి మూడు పల్టీలు కొట్టాడు. ఈ ఘటనలో చంద్రకాంత్ మెడకు వైరు తగిలిన గాయంతో పాటు రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన చైతన్యపురి ఇన్స్పెక్టర్ నాగార్జున కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.