సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): కొన్నేండ్లుగా క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ వంద కోట్లు పోగొట్టుకున్న నిందితుడు తిరిగి అదే బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బెట్టింగ్కు పాల్పడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న ముగ్గురు నిందితులను రాచకొండ పరిధి..ఎల్బీనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.20లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 1.42 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. నేరెడుమెట్లోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్.చౌహాన్ కేసు వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడకు చెందిన ఎడుకుల జగదీశ్ నాగోల్లోని బండ్లగూడలో ఉంటూ సబ్ బుకీగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. వనస్థలిపురానికి చెందిన జక్కిరెడ్డి అశోక్రెడ్డి వృత్తిరీత్యా రియల్ ఎస్టేట్ వ్యాపారి. క్రికెట్ బెట్టింగ్కు అలవాటుపడిన అతడు గడిచిన 10, 12 సంవత్సరాలలో దాదాపు రూ.100కోట్లు పోగొట్టుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడించాడు. కేపీహెచ్బీ కాలనీ, వసంతనగర్కు చెందిన చరణ్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఉద్యోగి. బెట్టింగ్ మోజులో పడి ఉద్యోగం మానేసి క్రికెట్ బుకీ సురేశ్ అలియాస్ శివకు కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. కాగా అశోక్రెడ్డి ఇతర సబ్ బుకీలైన శివ, ఏపీకి చెందిన పలాస శ్రీనివాసరావులను మరో సబ్ బుకీ జగదీశ్కు పరిచయం చేశాడు. జగదీశ్ మాత్రం హర్యానాకు చెందిన ప్రధాన బుకీ విపుల్ మోంగాతో నేరుగా సంబంధాలు సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జగదీశ్, అశోక్రెడ్డి, చరణ్లు కలిసి ‘నేషనల్ ఎక్స్ఛేంజ్-9’ ద్వారా ఈ బెట్టింగ్ రాకెట్ను నడిపిస్తున్నారు. ఈ క్రమంలో 2023 సీజన్ ఐపీఎల్ మ్యాచ్లో ఇప్పటి వరకు నిందితులు సుమారు 3 కోట్లను బ్యాంకు ఖాతాలతో పాటు నేరుగా మార్పిడి చేశారని తెలిపారు. కాగా ఈనెల 14న సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ @ ఈడెన్ గార్డెన్, కోల్కతా మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్పై చైతన్యపురి ఠాణా పరిధిలో ఫోన్ ద్వారా బెట్టింగ్కు పాల్పడుతుండగా సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి జగదీష్, జక్కిరెడ్డి , చరణ్లను అరెస్టు చేశారు. ప్రధాన బుకీతో పాటు ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. రాచకొండ సీపీ ఆదేశాల మేరకు ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ ఎ.సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.