సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): కేబీసీ లాటరీ వచ్చిందంటూ చాంద్రాయణగుట్టకు చెందిన ఓ వ్యాపారిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు నాలుగేండ్లుగా రూ.2 కోట్లు కొట్టేశారు. ఇదంతా మోసమని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు గురువారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… చాంద్రాయణగుట్టకు చెందిన బాధితుడు వ్యాపారి. 2018లో కేబీసీ (కౌన్బనేగా కరోడ్ పతి) లాటరీ వచ్చిందని, దాని విలువ రూ. 25 లక్షలని దుండగులు ఫోన్ చేశారు. మీ లాటరీ డబ్బు తీసుకోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు, ఛార్జీలు, పన్నులు చెల్లించాలని సూచించారు. సూచించిన మేరకు డబ్బులు చెల్లించిన తర్వాత.. మీ లాటరీ విలువ రూ. 50 లక్షలకు పెరిగిందని, గతంలో చెల్లించిన డబ్బంతా కలిపి మీకు వస్తుందంటూ నమ్మించారు. తిరిగి పన్నులు, ఛార్జీల పేరుతో డబ్బు వసూలు చేశారు. ఇలా నాలుగేండ్లుగా ప్రైజ్ మనీ పెరుగుతుందంటూ నమ్మిస్తూ బాధితుడి వద్ద నుంచి దాదాపు రూ.2 కోట్లు వసూలు చేశారు. నాలుగేండ్లు గడిచినా డబ్బులు పోవడం తప్పా.. రావడంలేదని.. ఇదంతా మోసమని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెట్టుబడి పేరుతో.. రూ. 16 లక్షలు
అంబర్పేటకు చెందిన ఒక వ్యాపారికి తక్కువ పెట్టుబడి పెడితే భారీ లాభాలంటూ ఒక మేసేజ్ వచ్చింది. స్పందించిన వ్యాపారి మెసేజ్లో ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేయడంతో ఒక లింక్ పంపించారు. ఆ లింక్ను క్లిక్ చేయగానే యాప్ డౌన్ లోడ్ అయ్యింది. అందులో మొదట రూ. 300 పెట్టుబడి పెట్టడంతో రూ. 15 లాభం వచ్చింది. ఆ తర్వాత రూ. 600 పెట్టుబడి పెట్టగా రూ. 30 లాభం వచ్చింది. ఎక్కువ డబ్బులు పెడితే భారీగా లాభాలొస్తాయంటూ సైబర్నేరగాళ్లు నమ్మించారు. దీంతో బాధితుడు దఫ దఫాలుగా రూ. 16 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.