సిటీబ్యూరో, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): ‘మీకు ఉద్యోగం ఇవ్వలేక పోయాం..మీ నగదును వాపస్ ఇస్తాం..అయితే మీరు మేము సూచించిన వెబ్సైట్లో వివరాలను నమోదు చేస్తే చాలు..కట్టిన డబ్బు జమ అవుతుంది’. అంటూ సరికొత్తగా బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఓ ప్రముఖ ఉద్యోగ అవకాశాలు కల్పించే వెబ్సైట్ పేరుతో తాజాగా అమాయకులకు గాలం వేస్తూ..ఖాతాలు కొల్లగొడుతున్నారు.
సైబర్ నేరగాళ్లకు జాబ్ వెబ్సైట్కు సంబంధించిన డేటా దొరకడంతో అందులో ఆరు నెలలుగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని..వాటి కోసం రుసుము చెల్లించిన నిరుద్యోగుల వివరాలను సేకరించారు. పేరొందిన కంపెనీ పేరుతోనే ఓ ప్రత్యేక వెబ్ సైట్ను ఓపెన్ చేసిన నిందితులు.. ఆ జాబ్ వెబ్సైట్లో దరఖాస్తు చేసిన వారికి ఫోన్లు చేసి.. బోల్తా కొట్టిస్తున్నారు. తాము రూపొందించిన వెబ్సైట్లో అమాయకులతో వివరాలను ఎంట్రీ చేయిం చి.. వారి ఖాతాల నుంచి నగదు ఖాళీ చేస్తున్నారు. అయితే తస్కరించిన నగదును తమ అకౌంట్ల్లో కాకుండా ఆన్లైన్లో పేకాటను నిర్వహించే యాప్ల్లోని వాలెట్స్కు పంపిస్తున్నారు. దీంతో పోలీసులకు ఆ నగదును రికవరీ చేయడం కష్టతరంగా మారింది.
నిజాంపేట్కు చెందిన సుబ్రహ్మణ్యం మూడు నెలల కిందట ఉద్యోగం కోసం ఓ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నాడు. ఫీజు కింద రూ. 6 వేలు చెల్లించాడు. అయితే అతనికి ఆ వెబ్సైట్ నిర్వహిస్తున్న సంస్థ నుంచి మూడు నెలలుగా ఎలాంటి సమాచారం రాలేదు. కొద్ది రోజుల కిందట ఓ వ్యక్తి ఫోన్ చేసి ‘కరోనా కారణంగా మేము మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయాం. మీరు కట్టిన డబ్బులు తిరిగి చెల్లిస్తాం.. నౌకరీ రిఫండ్స్.కామ్(naukari refunds.com) లో మీ వివరాలను నమోదు చేయండ’ని సూచించాడు.
ఆ మాటలు నమ్మిన బాధితుడు ఆ వెబ్సైట్ తెరిచి.. తన బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేశాడు. ఫోన్కు వచ్చిన ఓటీపీలు కూడా నమోదు చేయడంతో సుమారు లక్ష వరకు డబ్బులు పోయాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైం పోలీసులు తమ దర్యాప్తులో ప్రాథమికంగా సుబ్రహ్మణ్యం ఖాతా నుంచి బదిలీ అయిన నగదును సైబర్ దొంగలు ఆన్లైన్లో పేకాట నిర్వహిస్తున్న ఇన్ఫో ప్లే గేమ్స్ రమ్మీ వాలెట్ ఖాతాలోకి మళ్లించినట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు, ఫోన్ నంబరు, ఇతర వివరాలను అడిగితే అనుమానించాలని సైబర్క్రైం పోలీసులు సూచిస్తున్నారు. ఆగంతకులు ఫోన్లు చేస్తే..వాళ్లు చెప్పే విషయాలు నిజమైనవా కావా.. అని నిర్ధారించుకోవాలని, ఆ తర్వాతే స్పందించాలని చెబుతున్నారు. ఒకవేళ మోసపోతే 24 గంటల్లోపు డయల్ 100 లేదా 155260కు ఫిర్యాదు చేయాలని, నేరస్తుల బ్యాంక్ ఖాతాలు జప్తు చేయడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.