తక్కువ పెట్టుబడితో భారీ లాభం ఉందిరా…నీవు కూడా పెట్టుబడి పెట్టమని స్నేహితుడు లింక్ను పంపాడు. లింక్ను క్లిక్ చేస్తే మొదట లాభం వచ్చింది. ఆ తర్వాత నష్టపోయి పోలీసులను త్వరగా ఆశ్రయించాడు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించడంతో పోయిన సొత్తుకు సంబంధించి కొంత డబ్బును సైబర్ దొంగల ఖాతాల్లో ఫ్రీజ్ చేశారు.
ఇబ్రహీంపట్నం వెంకటరమణ కాలనీకి చెందిన ఓ విద్యార్థి(19)కి తన స్నేహితుడు (https://www.hptoken.com) ఓ లింక్ను పంపించాడు. ఇందులో రిజిస్టర్ చేసుకుని పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తున్నాయని వివరించాడు. దీంతో బాధితుడు అందులో రిజిస్టర్ అయి, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేశాడు. వెంటనే అతనికి హెచ్పీజెడ్ అప్లికేషన్ వచ్చింది. దానిని ఇన్స్టాల్ చేసుకోగానే అతను హెచ్పీజెడ్ వాట్సాప్ గ్రూపులో చేరిపోయాడు. వెంటనే అతనికి ఓ మహిళ చాట్ చేసి పెట్టుబడికి సంబంధించిన వివరాలను చెప్పింది.
ముందగా 6800 రూపాయలను పెట్టుబడిగా పెట్టగా, అతనికి ఓ అప్లికేషన్లో ఓ పేజీని కేటాయించి అందులో పెట్టుబడికి సంబంధించిన వివరాలు వచ్చిన లాభాన్ని ఎలా విత్ డ్రా చేసుకోవాలనే విషయాలను పొందుపర్చారు. బాధిత విద్యార్థి రూ. 6800 పెట్టుబడి పెట్టగానే అతనికి రూ. 14 వేల లాభం వచ్చింది. వాటిని వెంటనే విత్డ్రా చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ లింక్పై నమ్మకంతో దాదాపు 1.20 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అంతే అతని అప్లికేషన్లో విత్డ్రా ఆప్షన్ మాయమైంది. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే అప్రమత్తమై బాధితుడు ఇచ్చిన ఆధారాలతో నగదు బదిలీ అయిన ఖాతాలను గుర్తించారు. మహరాష్ట్రలోని ఓ ప్రైవేటు బ్యాంక్ కరెంట్ అకౌంట్ ఖాతాలో 78 వేల నగదును ఫ్రీజ్ చేశారు. వాటిని వెనక్కి రప్పించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇలా మోసపోయినప్పుడు 24 గంటలలోపు స్థానిక పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు, లేదా డయల్ 100 లేదా 155260కు ఫిర్యాదు చేస్తే నగదు సైబర్ ఖాతాల నుంచి బదిలీ కాకుండా కట్టడి చేయడంతో పాటు వాటిని తిరిగి బాధితుల ఖాతాల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని పోలీసు అధికారులు స్పష్టం
చేస్తున్నారు.