సిటీబ్యూరో, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఆదాయపన్ను శాఖ కస్టమర్ల ఖాతాలోకి సైబర్నేరగాళ్లు చొరబడుతున్నారా..? గురువారం హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో ఈ సందేహం వ్యక్తమవుతున్నది. హైదరాబాద్కు చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ తన క్లయింట్కు సంబంధించిన ఆదాయపన్ను చెల్లింపులు ఎక్కువ చేశారు. అతడికి తిరిగి రావాల్సిన సొమ్ము విషయమై.. ఆదాయ పన్ను శాఖకు లేఖ రాయగా, రూ. 21 లక్షలు వెనక్కి పంపించింది. అయితే క్లయింట్కు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంకు నుంచి చెల్లింపులు జరుగుతుంటాయి. ఆదాయపన్ను శాఖ రికార్డుల్లో అదే ఖాతా ఉంటుంది.
అదే అకౌంట్లోకి డబ్బులు తిరిగి రావాల్సి ఉండగా, నగదు రాలేదు. ఈ విషయాన్ని బాధితుడు ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో, ఇండస్ ఇండ్ బ్యాంకు ఖాతాలోకి నగదు బదిలీ అయినట్లు సమాధానం వచ్చింది. అయితే ఆ ఖాతాతో తనకు సంబంధం లేకపోవడంతో అందులోకి ఎలా బదిలీ అయిందో ఆరా తీశాడు. ఆ బ్యాంక్ అకౌంట్ విశాఖ పట్టణంలో ఉన్నట్లు బాధితుడు గుర్తించాడు. సదరు అకౌంట్లో ఉన్న డబ్బంతా డ్రా అయినట్లు తేలింది. ఆదాయపన్ను శాఖ థర్డ్పార్టీతో చాలా పనులు చేయిస్తుంది.
అందులో భాగంగా అక్కడి నుంచి ఏదైనా డేటా లీకై..ఎవరైనా కొత్త ఖాతాను అనుసంధానం చేశారా? సైబర్నేరగాళ్లు ఏమైనా హ్యాకింగ్ చేశారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితుడి తరఫున సదరు చార్టెడ్ అకౌంటెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరిన్ని వివరాలు అందిన తరువాత దీనిపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలని బాధితుడికి సూచించామని సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.