సైబర్ నేరగాళ్లు అమాయకులను బుట్టలో వేసుకునేందుకు అనేక దారులు వెతుకుతూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో మరో కొత్త మోసంతో ముందుకొచ్చారు. ‘మీకు రుణం క్రెడిట్ అయింది.. వద్దనుకుంటే.. మేము పంపించిన ఓటీపీని చెప్పండం’టూ.. అకౌంట్లు కొల్లగొడుతున్నారు.
-సిటీబ్యూరో, జనవరి 30(నమస్తే తెలంగాణ)
సైబర్ నేరగాళ్లు వివిధ బ్యాంక్లు, ఫైనాన్స్ కంపెనీలు, యూపీఐ సంస్థల కస్టమర్ కేర్ల ఫేక్ నంబర్లను రిజిస్టర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. కస్టమర్ కేర్ కోసం ఎవరైనా గూగుల్ సెర్చ్ చేసే క్రమంలో వీరి నంబర్లకు కాల్ చేస్తున్నారు. మీకు ఏ విధంగా సహాయపడగలమని మాట్లాడుతున్న ఆగంతకులు.. మరో నంబర్లను ఇస్తున్నారు. వాటికి ఫోన్ చేయగానే.. మీ ఆర్థిక పరమైన సమస్యను తీరుస్తామంటూ.. బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకుంటున్నారు. ఆ ఆధారాలతో ఆన్లైన్ లావాదేవిల కోసం పలు వెబ్ సైట్లు సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. బాధితుడికి ఓ ఫేక్ మెసేజ్ను రూపొందించి.. ‘మీ అకౌంట్కు రూ. 2లక్షల రుణం కింద క్రెడిట్ అయ్యిందని.. ఏదో ఒక సంస్థ పేరును టైప్ చేసి పంపిస్తున్నారు. రుణం కావాలన్నా.. వద్దన్నా.. మేము పంపిన ఓటీపీ చెప్పాలని సూచిస్తున్నారు. బాధితులు ఆ సంఖ్య చెప్పగానే అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు.
ఓ మహిళకు..
సనత్నగర్కు చెందిన విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగి భార్య గూగుల్పేలో నగదు చెల్లించింది. అయితే పేమెంట్ జరుగలేదని సమాధానం రావడంతో గూగుల్ పే కస్టమర్ కేర్ సిబ్బందిని సంప్రదించేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో సైబర్ నేరగాళ్లకు చిక్కింది. వారు ఖాతా వివరాలను తీసుకున్నారు. అనంతరం ఆమెకు రూ. 2.42 లక్షల రుణం
క్రెడిట్ పేరిట అకౌంట్ నుంచి రూ. 3.50 లక్షలు తస్కరించారు.
అది మోసమే
-సైబర్ క్రైం పోలీసులు
మీకు రుణం క్రెడిట్ అయ్యింది.. ఓటీపీలు చెప్పండంటే అది మోసమే. మీరు దరఖాస్తు చేసుకోకుండానే మీకు రుణం ఎలా వస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. ఓటీపీలు చెప్పకండి. దరఖాస్తు చేసుకోకుండానే రుణం ఎలా వచ్చిందో ఆరా తీయండి.