సిటీబ్యూరో, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): ఉప్పల్ స్టేడియంలో మార్చి ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే టీ 20 సెలబ్రిటీ క్రికెట్ లీగ్- 2024 మ్యాచ్కు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభమైన పదో ఎడిషన్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్- 2024 పోటీల్లో భాగంగా మార్చి 1వ తేదీ నుంచి ఉప్పల్లో ఈ పోటీలు జరుగనున్నాయని సీపీ తెలిపారు. ఇందులో భాగంగా బందోబస్తుపై డీసీపీలు, అదనపు డీసీపీలు తదితర సిబ్బందితో నేరేడ్మెట్లోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
వివిధ భాషాలకు చెందిన సినిమా తారలు పాల్గొనే ఈ సెలబ్రిటీ క్రికెట్ పోటీలు చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంటుందని, అందుకు తగ్గట్టుగా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీపీ సూచనలు చేశారు. టికెట్ల పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రతినిధులను సమన్వయం చేసుకోవాలన్నారు. స్టేడియంలో కూల్ డ్రింక్స్, ఇతర ఆహార పదార్థాల ధరలు నిబంధనల మేరకే ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీసీపీలు పద్మజ, కరుణాకర్, అరవింద్ బాబు, ఏసీపీలు శ్రీధర్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, నరేశ్రెడ్డి, నరేందర్ గౌడ్, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఫౌండర్ విష్ణువర్ధన్ ఇందూరి తదితరులు పాల్గొన్నారు.