గ్రేటర్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం కరోనా ఫస్ట్వేవ్లో కేసుల సంఖ్య మార్చి చివరలో మొదలైనప్పటికీ ఏప్రిల్ రెండో వారం నుంచి కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతూ.. మే నాటికి తీవ్రరూపం దాల్చింది. కానీ రెండో వేవ్లో మాత్రం మార్చి నుంచే కేసుల సంఖ్య పెరగడం మొదలైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని వైద్య, ఆరోగ్యశాఖ టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. గ్రేటర్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, జిల్లా దవాఖానలు, ఏరియా దవాఖానల్లో సైతం వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. పండగలు, పబ్లిక్ హాలిడేస్, వీకెండ్స్ వంటి సెలవు రోజుల్లో సైతం టీకా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఒక పక్క కరోనా పరీక్షలు నిర్వహిస్తూనే మరోపక్క టీకా అందిస్తున్నారు. మొదటి డోస్ తీసుకుని.. 28రోజులు గడిచిన వారికి రెండవ డోస్ను కూడా ఎలాంటి జాప్యం లేకుండా అందిస్తున్నారు. 45 ఏండ్ల వయస్సు దాటిన వారందరికీ గ్రేటర్లోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో టీకా పంపిణీ చేస్తున్నారు.