ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాపై ఆ కాలనీ విజయభేరి మోగించింది. బల్దియా నిబంధనలు, కాలనీ అసోసియేషన్ పక్కా ప్రణాళిక అమలుతో మహమ్మారి పరారైంది. రెండుదశల్లోనూ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా రికార్డు సృష్టించింది. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్లోని జయప్రకాశ్ నగర్ (జేపీనగర్) విజయగాథ ఇది. కాలనీలో 325 వ్యక్తిగత గృహాలు, 100 వరకు అపార్టుమెంట్లు ఉన్నాయి.
28 కాలనీలు ఉండగా, మొత్తం జనాభా 1800 మందిపైనే. కరోనా తొలిదశ విజృంభించినప్పటి నుంచి స్థానికులు తప్పక మాస్క్లు ధరించడం, శానిటైజేషన్, వ్యక్తిగత దూరం పాటించడంతోపాటు కాలనీవ్యాప్తంగా కరోనా సంహారక మందు చల్లించారు. మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. అంతేకాదు వ్యాక్సినేషన్లోనూ కాలనీవాసులు ఆదర్శంగా నిలిచారు. 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయి చందానగర్ సర్కిల్లో జేపీనగర్ మొదటి స్థానంలో నిలిచింది. రెండుదశల్లో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకున్న కాలనీవాసులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, బల్దియా అధికారులు పలు సందర్భాల్లో అభినందించారు.
కరోనా… ప్రపంచాన్నే వణికించిన మహమ్మారి. రెండు దశల్లో నమోదైన కేసులకు గణాంకాలే సరిపోవు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని జేపీ(జయప్రకాశ్నగర్) కాలనీలో మాత్రం రెండు దశల్లోనూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. కాలనీలో మొత్తం 28 అంతర్గత వీధుల్లో కలిపి 325 ఇండిపెండెంట్ ఇండ్లు, మరో 100 అపార్టుమెంట్లు ఉండగా, సుమారు 1800 మంది నివాసం ఉంటున్నారు.
కరోనాపై ప్రభుత్వానికి తోడ్పాటుగా కాలనీ అసోసియేషన్ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి. కాలనీవాసులు కొవిడ్ నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించేలా సంఘం సభ్యులు చర్యలు తీసుకున్నారు. కాలనీ వ్యాప్తంగా మైకు అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉండడంతో ప్రతీ అరగంటకు ఎస్ఎంఎస్ (శానిటైజేషన్, మాస్క్, సోషల్ డిస్టెన్స్)పై విస్తృతంగా ప్రచారం చేపట్టారు.
దీంతో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం, శానిటైజ్ వాడటం, సామాజిక దూరాన్ని పాటించారు. చందానగర్ సర్కిల్ పారిశుధ్య విభాగం సహకారంతో కాలనీ అసోసియేషన్ స్వీయ సిబ్బంది కాలనీలో సమర్థవంతంగా పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. దీనికి తోడు కాలనీవాసులందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ చేపట్టడంతో జేపీనగర్ కాలనీ చందానగర్ సర్కిల్లోనే మొదటి స్థానంలో నిలిచింది. ఫలితంగా రెండు దశల్లోనూ ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాకపోవటంతో కాలనీ సంఘాన్ని, కాలనీ వాసులను విప్ ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ నందగిరి సుధాంశ్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అభింనందించారు.
జేపీనగర్ కాలనీలో ప్రభుత్వ నిబంధనలకు తోడు కాలనీ సంఘం కూడా కఠిన నిబంధనలను అమలు పరిచింది. ఒక దశలో కాలనీవాసుల నిర్బంధమే అందరినీ కరోనా కేసులు రాకుండా కాపాడగలిగింది. కాలనీవాసులు కూడా పూర్తిగా సహకరించారు. కరోనాపై విజయం పూర్తిగా వారికే దక్కుతుంది. కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి చేస్తాం. – ఉప్పలపాటి శ్రీకాంత్, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్
ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది, కాలనీ వాసులందరి తోడ్పాటుతోనే కాలనీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకుండా బయటపడ్డాం. కొవిడ్ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించేలా మేం చేసిన ప్రయత్నాలు ఫలితాన్నిచ్చాయి.మా విజయంలో విప్ గాంధీ, స్థానిక కార్పొరేటర్ తోడ్పాటును ఎన్నటికీ మరువబోము. – అమ్మిరాజు, అధ్యక్షుడు, జేపీనగర్ కాలనీ సంక్షేమ సంఘం