జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 4846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్లోని 360 వాడలు, కాలనీల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిర్వహించనున్నారు. గ్రేటర్లో దాదాపు 90 శాతం అర్హులైన 18 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ టీకాను ఇప్పించారు. వీరే కాకుండా ఇంకా మిగిలిపోయిన ఏ ఒక్కరిని వదలకుండా వ్యాక్సిన్ను వందశాతం మందికి ఇప్పించేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లను చేసింది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలో 175 ప్రత్యేక సంచార కొవిడ్ వ్యాక్సిన్ వాహనాలను సిద్ధం చేశారు. ఇవే కాకుండా కంటోన్మెంట్ పరిధిలో మరో 25 వెహికిల్స్ను వైద్య ఆరోగ్యశాఖతో కలిపి ఏర్పాటు చేసింది.
ఆశవర్కర్లు, అంగన్వాడీ, ఎంటమాలజీ బృందాలకు చెందిన సిబ్బంది కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితా సేకరించి.. వ్యాక్సిన్ ఇచ్చే ఆరోగ్య సిబ్బందికి సమాచారం అందజేస్తారు. దీంతో పాటు వ్యాక్సిన్ తీసుకోని పౌరులకు తమ కాలనీలో ఏ రోజైతే ప్రత్యేక వ్యాక్సిన్ అందజేసే బృందం వస్తుంది? ఎక్కడికి? ఏ సమయంలో వస్తాయి? వ్యాక్సిన్ వేసే అధికారుల కాంటాక్టు వివరాలు కలిగిన ఒక కరపత్రం టీకా తీసుకోని వారికి అందజేస్తారు.
కాలనీలు, బస్తీల్లో వందశాతం అర్హులైన వారికి వ్యాక్సిన్ పూర్తయిన అనంతరం, ఆయా కాలనీలు, బస్తీలకు మరో ప్రత్యేక బృందం వెళ్లి వంద శాతం వ్యాక్సిన్ పూర్తయిన అంశాన్ని పరిశీలిస్తారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో మా కాలనీ, బస్తీలో వందశాతం అర్హులకు వ్యాక్సిన్ పూర్తయింది అనే బ్యానర్ను కూడా ప్రదర్శిస్తారు. ఈ కాలనీ సంక్షేమ సంఘాలకు 100శాతం వ్యాక్సిన్ పూర్తి చేసినందుకు జీహెచ్ఎంసీ ద్వారా ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.
ఆరోగ్య హైదరాబాదే లక్ష్యంగా చేపట్టిన 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీలు కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. ఈ వందశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరిని భాగస్వామ్యం చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ జీహెచ్ఎంసీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.