సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): నిన్నటిదాకా కరోనా విజృంభణతో ఇంటికే పరిమితమైన జన జీవనం నేటి నుంచి సాధారణం కానుంది. కరోనా కేసులు గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం లాక్డౌన్ను పూర్తిగా ఎత్తేసింది. దీంతో నగర రహదారులు జన సంద్రం కానున్నా యి. ముఖ్యంగా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో పరిమిత సమయంలోనే కొనసాగిన వ్యాపా ర లావాదేవీలు ఇక రోజంతా కొనసాగనుండటంపై వ్యాపారవర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు అన్నివర్గాల ప్రజలూ తమ ఉద్యోగ, ఉపాధి రంగాల్లో సాధారణ జీవనాన్ని కొనసాగించనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. లాక్డౌన్ ఎత్తివేతతోనే ప్రజలకు అసలైన పరీక్ష మొదలు కానుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికివారు స్వీయ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.
నెల రోజులకుపైగా లాక్డౌన్తో ఆంక్షల మధ్య కొనసాగిన నగర జీవనం నేడు సాధారణ స్థితికి రానుంది. కరోనా రెండో వేవ్ ప్రభావంతో వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 12న లాక్డౌన్ విధించింది. తొలుత ఉదయం 4 గంటల పాటు సడలింపులు ఇచ్చారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆపై సడలింపుల్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెంచారు. మరింత తగ్గుముఖం పట్టిన తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు సడలింపు ఇచ్చారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే… అంచెలంచెలుగా సడలింపులు ఇవ్వడంతో ఎట్టకేలకు కేసులు చాలామేరకు తగ్గాయి.
సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ ఎత్తివేసిన నేపథ్యంలో సోమవారం నుంచి మెట్రో సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయి. ఉదయం 7 గంటలకు మొదటి రైలు ప్రారంభమైతే, చివరి రైలు రాత్రి 9 గంటల ప్రారంభమై 10 గంటలకల్లా చివరి స్టేషన్కు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.