పహాడీషరీఫ్, జనవరి 16 : జల్పల్లి మున్సిపాలిటీ ప్రధాన రహదారికి మోక్షం లభించింది. చినుకు పడితే చెరువును తలపించే ఈ రోడ్డు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించడంతో సుందరంగా దర్శనమిస్తున్నది. నాడు బురదమయమైన ఈ రోడ్డు, అడుగడుగునా గుంతలతో మున్సిపాలిటీ వాసులు నానా అవస్థలు పడేవారు. అస్తవ్యస్తంగా మారిన రోడ్డుపై రాకపోకలు సాగించలేక ఆర్టీసీ బస్సులు సైతం రూటు మార్చేశాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రధాన రహదారి పూర్తిగా మూతపడేది. అయితే స్థానికుల సమస్యలను గుర్తించి మంత్రి సబితారెడ్డి రోడ్డు అభివృద్ధికి రూ.65 లక్షలు మంజూరుచేశారు. అనుకున్నదే తడవుగా పనులను శరవేగంగా పూర్తిచేశారు. జల్పల్లి గ్రామం అంబేద్కర్ విగ్రహం నుంచి ముత్యాలమ్మ దేవాలయం చౌరస్తా వరకు కిలోమీటర్ మేర ఒక వంతు బీటీ, మూడు వంతులు సీసీ రోడ్డును వేశారు. పనులు పూర్తికావడంతో వాహనదారులు సాఫీగా సాగిపోతున్నారు. రోడ్డు అభివృద్ధికి కృషి చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డితో జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ వసంత, కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు యంజాల జనార్దన్, షేక్ జహంగీర్, సీనియర్ నాయకులు సూరెడ్డి జంగారెడ్డి, నాగేశ్ ముదిరాజ్, యంజాల అర్జున్, వాసుబాబు తదితరులకు జల్పల్లి వాసులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం
ఇన్నాళ్లు రోడ్డు సమస్యతో జల్పల్లి వాసులు ఇబ్బందులు పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరిగాయి. జల్పల్లిలో దీర్ఘకాలికంగా ఉన్న డ్రైనేజీ సమస్యతో పాటు రోడ్డు సమస్యలు పరిష్కారం అయ్యాయి. ప్రస్తుతం రోడ్డు అభివృద్ధి చేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– షేక్ జహంగీర్, జల్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు, జల్పల్లి మాజీ ఉపసర్పంచ్
మంత్రికి చెప్పగానే నిధులు విడుదల
అభివృద్ధియే ధ్యేయంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి పని చేస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వర్షం కురిసిన ప్రతిసారి జల్పల్లి నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు రోడ్డు పూర్తిగా ముంపునకు గురయ్యేది. మంత్రి ప్రత్యేక దృష్టిసారించి సమస్యను పరిష్కరించారు. సమస్యలు చెప్పగానే నిధులు కేటాయించి పరిష్కరిస్తున్న మంత్రికి కృతజ్ఙతలు.
– యంజాల జనార్దన్, జల్పల్లి మున్సిపాలిటీ ,బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ