మేడ్చల్, ఏప్రిల్ 17 : అఘోరిగా చెలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్న అఘోరి అలియాస్ శ్రీ నివాస్ అలియాస్ శివ విష్ణు బ్రహ్మ అల్లూరి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన జోగిని సంధ్య గురువారం శామీర్పేట పోలీస్స్టేషన్లో సీఐ శ్రీనాథ్ను కలిసి ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా జోగిని సంధ్య మాట్లాడుతూ.. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని, శివసత్తులు, జోగినిలు, హిజ్రా వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. అతడు అఘోరి కాదని, అసలు హిజ్రానే కాదన్నారు. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో ఆడపిల్లలాగా ఉండి, ఒక ఆడపిల్లను పెండ్లి చేసుకొని, తాజాగా వర్షిణి అనే అమ్మాయిని పెండ్లి చేసుకొని హిజ్రాలకు మాయని మచ్చ తెచ్చాడన్నారు.
దీంతో అతడి బండారం బయటపడిందని, ప్రభుత్వం, పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. నేను మొదటి నుంచి అఘోరి అలియాస్ శ్రీనివాస్ పై పోరాటం చేస్తున్నానని, కత్తులతో దాడి చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సీఐ శ్రీనాథ్ మాట్లాడుతూ.. జోగిని సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.