ఎమ్మెల్యే ముఠా గోపాల్
కవాడిగూడ, జూలై 3: ముషీరాబాద్, కవాడిగూడ వైశ్రాయ్ హోటల్ వరకు చేపట్టే రోడ్డు విస్తరణలో దుఖానాలు, ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ బాధితులకు హామీ ఇచ్చారు. బాధితులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆదివారం కవాడిగూడలోని శంకారారాధ్య మఠంలోని ఆడిటోరియంలో కవాడిగూడ, ముషీరాబాద్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణలో భాగంగా దఖానాలు, ఇండ్లు కోల్పోయే బాధితులతో కవాడిగూడ, ముషీరాబాద్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముషీరాబాద్ నుంచి కవాడిగూడ వైశ్రాయ్ హోటల్ వరకు జీహెచ్ఎంసీ రోడ్డు విస్తరణ పనులకు ముందుగా వంద ఫీట్లకు మార్కింగ్ చేసిందని అన్నారు. దీంతో 215 మంది తీవ్రంగా నష్టపోతున్నారని బాధితులు ఇచ్చిన వినతి మేరకు అధికారులతో మాట్లాడి ఒప్పించి రోడ్డు విస్తరణను 80 ఫీట్లకు కుదించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.
రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన బాధితులకు పరిహారాన్ని చెక్కుల రూపంలో అందజేస్తామని అన్నారు. ఈ ప్రాంత వాసులు అభివృద్ధికి అన్ని విధాలా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. దీంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ముఠా గోపాల్ను అసోసియేషన్ ఆధ్వర్యంలో షాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తలకొక్కుల సంజీవ్కుమార్, ప్రధాన కార్యదర్శి పీఎస్ రాజు, కోశాధికారి శెరిపల్లి గణేశ్. సభ్యులు శంకర్, అశ్విన్, యాదగిరిలతో పాటు బాధితులు పాల్గొన్నారు.