సిటీబ్యూరో: క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి రంగంలోకి దిగి ట్రాఫిక్ వ్యవస్థను చక్కబెట్టేందుకు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. పలు సూచనలు చేశారు. డీజీపీ కూడా ఇలాంటి సమావేశాన్ని నిర్వహించారు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సైతం ట్రాఫిక్ సమస్యపై సమీక్ష నిర్వహించారు.
రద్దీ వేళల్లో ట్రాఫిక్ పోలీసులకు లా అండ్ ఆర్డర్ పోలీసులు సహకరించాలని, ట్రాఫిక్ రద్దీ లేకుండా అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే సిబ్బంది రంగంలోకి దిగి.. ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టారు. ఫలితంగా గురువారం రద్దీ వేళల్లో చాదర్ఘాట్, నల్గొండ క్రాస్రోడ్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం తరువాత సాఫీగా రాకపోకలు సాగాయి.