వెంగళరావునగర్, ఫిబ్రవరి 2: నిన్నమొన్నటి వరకు కబ్జాదారుల చేతుల్లో చిక్కుకొని కోర్టు కేసుల మధ్యన నలిగిపోయిన ఆ స్థలం నేడు ఆహ్లాదానికి కేరాఫ్గా మారింది. చుట్టూ పచ్చని మొక్కలు, వాకింగ్ ట్రాక్లు, పిల్లలు ఆడుకోవడానికి ఆట పరికరాలు, చదువుకోవడానికి సకల వసతుల ఏర్పాటుతో ఆకట్టుకుంటున్నది కళ్యాణ్నగర్ పార్కు. 3వేల గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలాన్ని జీహెచ్ఎంసీకి కాలనీవాసులు గిఫ్ట్ డీడ్ చేయగా.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జి మాగంటి గోపీనాథ్ దత్తత తీసుకొని సుమారు రూ.2 కోట్లు వెచ్చించి థీమ్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ సేద తీరేలా సకల వసతులు కల్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో థీమ్ పార్క్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నామని ఎమ్మెల్యే మాగంటి తెలిపారు. అంతేకాకుండా మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం బెంచీలు, కుర్చీలు, విద్యుదీపాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్కులో నేరేడు, ఉసిరి, వేప తదితర ఔషధ మొక్కలు, ఆకట్టుకునే పూల మొక్కలను నాటారు. ప్రస్తుతం ఈ థీమ్పార్కు పిక్నిక్ స్పాట్ను తలపిస్తున్నదని స్థానికులు పేర్కొంటున్నారు.
పోరాటం ఫలించింది
ఎన్నో ఏళ్లుగా కబ్జా దారుల చేతుల్లో చిక్కుకున్న ఈ స్థలాన్ని కాపాడుకునేందుకు కాలనీవాసులంతా కలిసికట్టుగా పోరాడారు. పోరాటం ఫలించింది. స్థలాన్ని రక్షించుకున్నాం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సహకారంతో ఇక్కడ థీమ్ పార్కు నిర్మితమవుతున్నది.
– రామరాజు, కాలనీ వాసి
అది కాలనీ స్థలం
కబ్జాదారులు కరెన్సీ నోట్ల కట్టలతో నన్ను లొంగదీసుకోవాలని చూశారు. నన్నెవరూ డబ్బుతో కొనలేరు. ఈ స్థలాన్ని వదిలివెళ్లాలని కబ్జాదారుల్ని హెచ్చరించాను. అది కాలనీ స్థలం. ప్రజల కోసమే ఆ స్థలాన్ని కేటాయించి అభివృద్ధి చేయాలని నిర్ణయించాను. వెంటనే పార్కు అభివృద్ధికి శ్రీకారం చుట్టాము. పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
– మాగంటి గోపీనాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే