సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరూ నేత్రదానం చేసే విధంగా ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. 36వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ శర్మన్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకవ్యక్తి నేత్ర దానం చేస్తే.. ఇద్దరికి కంటి చూపు వస్తుందన్నారు. నేత్ర దానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఒక ఉద్యమంలా ముందుకు వెళ్లాలన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడే స్వచ్ఛందంగా నేత్ర దానం చేసేందుకు ముందుకు వస్తారని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, తదితరులు పాల్గొన్నారు.