సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): జాతీయ మాస్టర్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన మహిళా ఉద్యోగిని వి.శోభారాణిని ఉన్నతాధికారులు అభినందించారు. ఈనెల 18 నుంచి 22 వరకు కేరళలో జరిగిన టేబుల్ టెన్నిస్ పోటీల్లో రాష్ట్రం తరఫున గణాంక శాఖలో పనిచేస్తున్న వి.శోభారాణి మహిళల 40 ప్లస్, 45 ప్లస్ విభాగంలో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో నాలుగు బంగారు పతకాలను సాధించింది.
అదేవిధంగా జపాన్లో జరుగబోయే అంతర్జాతీయ మాస్టర్స్ గేమ్స్-2023లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నది. ఈ సందర్భంగా గణాంక శాఖ సంచాలకులు జి.దయానందం, ఉప సంచాలకుడు సురభి వెంకటేశ్వర్లు, సహ ఉద్యోగులు ఆమెను అభినందించారు.