జవహర్నగర్, జూన్ 11: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు అత్యధిక పింఛన్ పెంచి సీఎం కేసీఆర్ దేవుడయ్యాడని, దివ్యాంగులకు సమాజంలో మరింత ఆత్మగౌరవం పెరిగిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్నగర్ కార్పొరేషన్లోని డీఎన్ఆర్ గార్డెన్లో మేయర్ మేకల కావ్య ఆధ్వర్యంలో దివ్యాంగులకు పింఛన్ రూ.4,016 పెంచిన నేపథ్యంలో సీఎం కేసీఆర్కు కృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని.. దివ్యాంగుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారని అన్నారు. అంగవైకల్యం శారీరానికే కానీ… మనసుకు కాదని, దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.
పెంచిన పింఛన్తో తెలంగాణలోని 5 లక్షల మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. 1000 మంది దివ్యాంగులకు భోజనం ఏర్పాటు చేసిన మంత్రి మల్లారెడ్డి.. వారికి వడ్డించి భోజనం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, దివ్యాంగులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. దివ్యాంగుడికి మంత్రి మల్లారెడ్డి స్వయంగా అన్నం తినిపించారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్మన్ ప్రణిత, నాగారం మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి, జవహర్నగర్ కార్పొరేటర్లు, కో- ఆప్షన్సభ్యులు, మున్సిపల్ ఆర్వో ప్రభాకర్ యాదవ్, జిల్లా నాయకుడు మేకల అయ్యప్ప, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.