రంగారెడ్డి, జూన్ 22(నమస్తే తెలంగాణ)/శంకర్పల్లి: తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించినప్పటి నుంచి పారిశ్రామిక పెట్టుబడుల్లో రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలుస్తూ వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు రంగారెడ్డి జిల్లా ప్రాంతానికి క్యూ కడుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన మేధా సంస్థ కొండకల్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ఫ్యాక్టరీని ప్రారంభించుకుంది. టీఎస్ ఐ పాస్తో పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడం, పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడం వంటి చర్యల మూలంగా జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. ఈ అభిప్రాయాల్ని పారిశ్రామిక రంగ నిపుణులు తెలంగాణ సిద్ధించినప్పటి నుంచి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే పారిశ్రామిక వేత్తలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దరఖాస్తు చేసిన నాటి నుంచి అనుమతులు వచ్చే వరకు చెప్పులరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోనే కాదు రంగారెడ్డి జిల్లాలోనూ పారిశ్రామిక విజయం సాధ్యమైంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోడ్ల విస్తరణ జరగడం, తగినంత మ్యాన్ పవర్ లభిస్తుండటం, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండటం, నీటి వనరులు అందుబాటులోకి రావడం, భూగర్భ జలాలు దండిగా ఉండటం వంటి అంశాలు పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్నాయి. మార్కెటింగ్, రవాణాకు ఈ ప్రాంతం అనువుగా ఉంది. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, రైస్ మిల్లులు, సీడ్ ప్రాసెసింగ్, టీవీ, మొబైల్స్ తయారీ, ప్యాకింగ్ కంపెనీ వంటి యూనిట్లు నెలకొల్పేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా మైక్రో సాఫ్ట్, గూగుల్, బోయింగ్, విప్రో, ఫాక్స్ కాన్ వంటి దిగ్గజ సంస్థలు అనేకం రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి.
హైదరాబాద్ మహా నగరానికి శంకర్పల్లి మండలం దగ్గర్లో ఉన్నప్పటికీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం జీవో 111ను రద్దు చేయడంతో ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించడం సంతోషకరం.
– వెంకట్రెడ్డి, ప్రొద్దుటూరు గ్రామం
కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ కృషి మరువలేనిది. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సాహిస్తూ, కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్యాక్టరీలకు అండగా నిలుస్తూ పారిశ్రామిక అభివృద్ధికి కేసీఆర్ తోడ్పాటును అందిస్తున్నారు. కొత్తగా పెట్టుబడులను ప్రోత్సాహించడం ద్వారా నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి పరుస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలి.
– రవీందర్ గౌడ్, మీర్జాగూడ గ్రామం
శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సీఎం కేసీఆర్ చొరవతోనే ఏర్పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సాహిస్తూ తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్థి పథంలో నడిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ద్వారా విదేశాలకు బోగీలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదిగిందంటే.. అది కేవలం సీఎం కేసీఆర్ పరిపాలన వల్లే సాధ్యపడింది. రాష్ట్రం మరింత పురోగతి సాధించాలంటే కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన భాధ్యత అందరిపైనా ఉంది. – రాజు నాయక్, మోకిల గ్రామం