శంషాబాద్, జూన్ 29: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడికి ప్రకృతి సిద్ధమైన నైవేద్య రూపంగా సాత్విక, వైదికమైన ఆహారాన్ని అందించే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని చినజీయర్ స్వామి అన్నారు. తిరుమల తిరుపతికి చినజీయర్ ఆశ్రమం నుండి సేంద్రియ వ్యవసాయ, గోఆధారిత ఉత్పత్తులు పంపిణీ చేసే వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి మాట్లాడుతూ, గోవిందునికి సంపూర్ణ నైవేద్యం కోసం తిరుమలకు మూడు నెలల పాటు అవసరమైనంత సరుకులను మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు సమకూర్చారని తెలిపారు. జూలై 1 నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంందన్నారు. ఆ భగవంతుడు కరోనా మహమ్మారి నుంచి శాశ్వత విముక్తి కల్గిస్తాడని పేర్కొన్నారు. హైదరాబాద్ యుగ తులసి ఫౌండేషన్ అండ్ సేవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాతలు మైహోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, ఆశ్రమ సిబ్బంది పాల్గొన్నారు.