సికింద్రాబాద్, అక్టోబర్ 27: నిషేధిత గుట్కా తయారీ గుట్టును చిలకలగూడ పోలీసులు రట్టు చేశారు. గుట్కా తయారీకి వినియోగించే రూ.44.60 లక్షల విలువైన ఇరవై రకాల పొగాకు ఉత్పత్తుల ముడిసరుకు, తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నరేశ్, డీఐ సంజయ్ కుమార్తో కలిసి గోపాలపురం ఏసీపీ సుధీర్ కుమార్ వివరాలు వెల్లడించారు.
బహదూర్పురా కాంచన్బాగ్కు చెందిన అగర్వాల్ ప్రదీప్ కుమార్ సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చిలకలగూడ, కాచిగూడ, సూరారం ప్రాంతాలకు చెందిన నవీన్ కుమార్, దలాల్ గోవింద్, సింహాద్రి మోహన్రావులతో ముఠాగా ఏర్పడ్డాడు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుంచి గుడ్లక్ జఫ్రానీ జర్దా, రాజాచాప్ తంబాకు, కృష్ణచాప్ చాయినీ, భవ్వా టుబాకో, సూర్య చాప్టతోపాటు పలు రకాల ఖైనీలు, గుట్కాల ముడిసరుకును దిగుమతి చేసుకుని కాచిగూడలోని దలాల్ గోవింద్కు చెందిన గోడౌన్లో నిల్వ చేసేవారు.
చిలకలగూడలో దొరికిన నవీన్ కుమార్ అందించిన సమాచారం మేరకు పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కాచిగూడ, సూరారం, కాంచన్బాగ్లలోని గోడౌన్లపై ఏకకాలంలో దాడులు చేపట్టి గుట్కా తయారీకి వినియోగించే రూ.44.60 లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుత మార్కెట్లో వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా. నిందితులు తలారీ నవీన్ కుమార్ (40), దలాల్ గోవింద్ (53), సింహాద్రి మోహన్రావు (42), అగర్వాల్ ప్రదీప్కుమార్ (66)లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
గుట్కా తయారీ ముడిసరుకుతోపాటు గుట్కా లేబుళ్లు, ద్విచక్ర వాహనాలు, సెల్ఫోన్లు, గుట్కా తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిషేధిక గుట్కా తయారీ గుట్టును రట్టు చేసిన చిలకలగూడ సీఐ నరేశ్, డీఐ సంజయ్కుమార్, డీఎస్ఐ సాయికృష్ణ, ఎస్ఐలు శ్రీనివాస్, రఘువీర్రెడ్డి, కానిస్టేబుళ్లు వసీ, ప్రకాశ్, నర్సింహారెడ్డి, వినయ్, వర ప్రసాద్, శ్రీనివాసులు, సతీష్లకు రివార్డు అందించనున్నట్లు గోపాలపురం ఏసీపీ సుధీర్ కుమార్ తెలిపారు.
నగర సీపీ అంజనీకుమార్ ఆదేశాల మేరకు చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చిలకలగూడకు చెందిన తలారి నవీన్ కుమార్ సికింద్రాబాద్ మోండా మార్కెట్లో పూజా సామగ్రి దుకాణం ముసుగులో నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్నాడు. సీతాఫల్మండి మైలార్గడ్డలో గోడౌన్ నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 25న మైలార్గడ్డలోని గోడౌన్పై దాడి చేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నవీన్కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా తీగ లాగితే డొంక కదిలిన చందాన గుట్కా తయారీ విధానం సూత్రదారితోపాటు పాత్రదారులు, నగరంలోని పలు ప్రాంతాల్లోని గోడౌన్ల వివరాలు వెల్లడించాడు.