Chezuba | చదువు విజ్ఞానాన్ని ఇస్తుంది. కొలువు సంపాదన సమకూరుస్తుంది. నైపుణ్యం ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పుతుంది. కానీ, ఇవేవీ.. ఆనందాన్ని ఇవ్వలేవు. సేవ మాత్రమే ఆనందానికి తోవ. మన వ్యక్తిగత, వృత్తిగత జీవితానికి ఖర్చుచేయగా మిగిలిన సమయంలో కొంత సమాజానికి కూడా కేటాయించమని చెబుతున్నాడు.. చెజుబా అనే వలంటరీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు, హైదరాబాద్ బిడ్డ రొంపల్లి సుఖేందర్ రెడ్డి. ఈ నెట్వర్క్ నలభై దేశాలకు విస్తరించింది. ఎనిమిదివేల మంది స్వచ్ఛంద సేవకులను సమాజం కోసం సిద్ధంగా ఉంచుతున్నది.
సుఖేందర్ రెడ్డి హైదరాబాద్లో పుట్టిపెరిగాడు. ఐఐటీలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎంబీయే చేయాలని ఆలోచన. దానికి సంబంధించి దరఖాస్తు నింపుతున్నాడు. పేరు, తండ్రిపేరు, పుట్టినతేది, విద్యార్హతలు, మార్కులు, అభిరుచులు, స్పోర్ట్స్.. ఇలా ప్రతి కాలమ్ చకచకా పూర్తి చేస్తూ వెళ్తున్నాడు. ‘మీ జీవిత లక్ష్యం ఏమిటి?’ అనే ప్రశ్న దగ్గర కలం ఆగిపోయింది. ‘అవును. నా జీవిత లక్ష్యం ఏమిటి? మొన్నటి వరకూ ఐఐటీలో సీటు. ఇప్పుడు మేనేజ్మెంట్ డిగ్రీ. ఆ తర్వాత కార్పొరేట్ కొలువు. అదయ్యాక..’ అంతకుమించి ఆలోచన ముందుకు సాగలేదు. అతనే కాదు, కెరీర్ పరుగులో పడిపోయి చాలామంది అదే జిందగీ అనుకుంటారు. సుఖేందర్కు ఆ తప్పు చేయాలని అనిపించలేదు. అప్లికేషన్ ఫామ్ చెత్తబుట్టలో పడేశాడు. భుజానికి బ్యాగ్ తగిలించుకుని ప్రపంచం మీదికి వెళ్లాడు. జీవిత లక్ష్యాన్ని వెతుక్కునే పని మొదలుపెట్టాడు. ముందుగా, మయన్మార్ చేరుకున్నాడు. ఎంతోమంది విద్యార్థులు, వలంటీర్స్ అక్కడ పరిచయం అయ్యారు. అప్పుడే.. ఆన్లైన్ వలంటీరింగ్ ప్లాట్ఫామ్ ప్రారంభిస్తే బావుంటుందనే ఆలోచన వచ్చింది. చాలామందికి ప్రపంచాన్ని మార్చేయాలన్నంత ఆవేశం ఉంటుంది. అందుకు సరైన వేదిక, తగిన మార్గ నిర్దేశనం ఉండదు. ఆ బాధ్యత తాను తీసుకోవాలని తీర్మానించాడు. అక్కడి మిత్రులతో సంభాషిస్తున్నప్పుడు మయన్మారీ భాషలో ఓ పదం బాగా నచ్చింది. అడిగి అర్థం తెలుసుకున్నాడు. చెజుబా.. అంటే కృతజ్ఞతలు, థ్యాంక్ యూ! ప్రపంచానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆ యువకుడికి అర్థమైంది.
అలా సుఖేందర్ ఎంబీయే ఆలోచన పక్కనపెట్టి.. చెజుబా మీదే పూర్తిగా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనల్ని మిత్రుడు జగన్ కొత్తచెర్లతోనూ పంచుకున్నాడు. ‘నాకూ అచ్చంగా ఇలాంటి ఐడియాసే ఉన్నాయి డ్యూడ్’ అంటూ చెజుబా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా వ్యవహరించడానికి ముందుకొచ్చాడు. అప్పటికి జగన్ విద్యా సంబంధమైన స్టార్టప్ ప్రారంభించే పనిలో ఉన్నాడు. తైవాన్కు చెందిన స్ట్రకోవా ఫేస్బుక్ ద్వారా సుఖేందర్కు పరిచయమైంది. ఆమె ఫౌండర్స్ టీమ్లో చేరేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చింది. అప్పటికే తను భారతదేశంలోని కొన్ని ఎన్జీవోలలో వలంటీర్గా సేవలు అందించింది. ఆ ముగ్గురు మిత్రుల చొరవతో.. చెజుబా ప్రాణంపోసుకుంది.
సరిగ్గా ఆరేండ్లు గడిచిపోయాయి. ఇప్పుడు చెజుబా దాదాపు ఎనిమిదివేల మంది స్వచ్ఛంద సేవకుల సమూహం. వీరిలో నలభైశాతం మంది విద్యార్థులే. ముప్పైశాతం వరకూ ఉద్యోగులు, ఇతర ప్రొఫెషనల్స్ ఉంటారు. అరవై రెండు దేశాలలో నాలుగువేల ఎన్జీవోలు వీరికి మద్దతుగా నిలుస్తున్నాయి. భూకంపాలు, తుఫాన్లు తదితర విపత్తులు ఎక్కడ సంభవించినా చెజుబా ప్రతినిధులు రంగంలో దిగిపోతారు. అంకితభావంతో పనిచేస్తారు. అవసరమైతే ప్రాణాలకు తెగిస్తారు. ప్రాజెక్టు పూర్తయిన వెంటనే వెనక్కి వెళ్లిపోతారు. ఆ దేశంలోనో, ప్రాంతంలోనో వారికి ఆతిథ్యం ఇచ్చిన ఎన్జీవో ఫీడ్బ్యాక్ ఆధారంగా వలంటీర్లకు సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. ఇక్కడ రెండురకాల సేవలు ఉంటాయి. ఒకటి ఆన్లైన్, ఒకటి ఆఫ్లైన్. నేరుగా వెళ్లి ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం ఒక పద్ధతి. ఏదైనా సంస్థకు వెబ్సైట్ నిర్మించి ఇవ్వడం, ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం.. మొదలైనవి ఇంకో పద్ధతి. క్రౌడ్ ఫండింగ్, కార్పొరేట్ సామాజిక బాధ్యత.. ఈ రెండూ చెజుబా ఆదాయ వనరులు. ‘ఇదంతా తొలి అడుగు మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది. టాటా కంపెనీలు సైతం మాకు సాయం అందించడానికి ముందుకొచ్చాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరుపుతున్నాం. స్వచ్ఛంద సేవ జీవితాలను మలుపుతిప్పే అనుభవం. మనం ప్రపంచాన్ని అర్థం చేసుకోడానికి ఇదొక గవాక్షం’ అంటారు చెజుబా వ్యవస్థాపకులు.. సుఖేందర్, జగన్, స్ట్రకోవా. కంపెనీలు సిబ్బంది కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నాయి. సంతోషమే. కానీ సామాజిక సేవలోనూ భాగం కల్పిస్తే.. జీతంతోపాటు సంతృప్తినీ ఇచ్చినవారు అవుతారు. దీనివల్ల సిబ్బంది ఉత్పాదకత పెరుగుతుంది. మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు. చెజుబా తక్షణ కర్తవ్యం కూడా ఇదే.