శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 16: స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ చెతిలో కత్తిపోట్లకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న నానక్రాంగూడకు చెందిన చెఫ్ మృతి చెందాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన గౌడ శివప్రసాద్ అలియాస్ ఆదిత్య (29) నగరానికి వచ్చి నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని గోల్స్ఎడ్జ్ అపార్టుమెంట్ ఉంటున్న రియల్టర్ కేవీఎస్ భాస్కర్ ఇంట్లో చెఫ్గా పనిచేస్తున్నాడు. ఈనెల 8న కాకినాడకు చెందిన సాయిశ్రీ స్విగ్గీ యాప్లో మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్ నుంచి స్వీట్లు ఆర్డర్ చేసింది. డెలివరీ నానక్రాంగూడలోని కేవీఎస్ భాస్కర్ ఇంట్లో ఇవ్వాలంటూ ఆర్డర్లో సూచించింది. ఈ ఆర్డర్ డెలివరీ బాధ్యతను ఆసిఫ్నగర్కు చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ ఎస్కే అహ్మద్ తీసుకున్నాడు.
యాప్ లొకేషన్ ద్వారా ఆర్డర్ను డెలివరీ చేసేందుకు వెళ్లిన అహ్మద్ చిరునామా తెలియక తొలుత ఆర్టీసీ క్రాస్రోడ్కు వెళ్లాడు. అక్కడ అడ్రస్ సరిగా లేకపోవడంతో ఆర్డర్ చేసిన సాయిశ్రీకి ఫోన్చేసి అడ్రస్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆమెకు హిందీ రాకపోవడంతో నానక్రాంగూడకు చెందిన భాస్కర్తో పాటు అతడి వద్ద పనిచేసే విక్కీ అలియాస్ సిద్ధార్థతో మాట్లాడి నానక్రాంగూడ లోకేషన్ను తెలుసుకున్నాడు. డెలివరీ ఆలస్యమైందంటూ సాయిశ్రీ, విక్కీ కోపంతో అహ్మద్ను తిట్టారు. అహ్మద్ సాయంత్రం 5 గంటల సమయంలో నానక్రాంగూడలోని ఫ్లాట్కు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో యజమాని భాస్కర్, విక్కీ లేరు. వారిద్దరూ బయటకు వెళ్లారని, వచ్చే వరకు ఉండమని చెప్పారంటూ అక్కడున్న చెఫ్ శివప్రసాద్ చెప్పాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో ఇరువురు ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడే డైనింగ్ టేబుల్పై ఉన్న కత్తిని తీసుకున్న అహ్మద్ కోపంతో చెఫ్పై దాడిచేశాడు. కత్తిపోట్లకు గురైన శివప్రసాద్ దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.