దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా మెట్రో నగరాల్లో క్రమంగా పెరుగుతున్న వాయు కాలుష్యం నియంత్రణపై సీపీసీబీ (సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) దృష్టి సారించింది. ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానంతో వాయుకాలుష్యం నమోదు, నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న సీపీసీబీ రాష్ర్టాల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు సైతం వాయుకాలుష్య నియంత్రణకు అనేక మార్గదర్శకాలను అందిస్తున్న సంగతి విధితమే. అయితే దేశంలోని మారుమూల ప్రాంత ప్రజల నుంచి పట్టణాలు, మెట్రో నగరాల్లో నివసించే వారు అనేక మంది సాంకేతిక ప్రయోగాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వాయుకాలుష్య నియంత్రణపై నూతన ఆవిష్కరణలను సీపీసీబీ ఆహ్వానిస్తున్నది. అంతేకాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఆవిష్కరణలు అద్భుతంగా ఉంటే కేటగిరిల వారీగా రూ.5లక్షలు, రూ.3లక్షలు, రూ.2లక్షలు చొప్పున ప్రైజ్మణి కూడా అందించనున్నది.
తాజాగా వాయు కాలుష్య నియంత్రణకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇన్నోవేటర్స్, ఆవిష్కర్తలతో పాటు కనన్సార్టియం భాగస్వాములు, కంపెనీలు, విద్యాసంస్థలు, పరిశోధన కేంద్రాలు, పౌర సమాజం (ఎన్జీవోలు), పారాస్టాటల్స్/మున్సిపల్ సంస్థల నుంచి సరికొత్త ఆవిష్కరణలు పంపాలని సీపీసీబీ కోరుతుంది. ఈ చాలెంజ్లో పాల్గొనేందుకు పైన తెలిపిన వ్యక్తులు రూపొందించిన సాంకేతిక ప్రయోగాలను గుర్తింపుపొందిన ప్రయోగశాల ద్వారా పరీక్షిస్తారు. లేదా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఎన్విరాన్మెంటర్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NEERI) వంటి ప్రసిద్ధిపొందిన జాతీయ సంస్థలు ఆమోదించాల్సి ఉంటుంది.
ఇన్నోవేటర్స్ రూపొందించి పంపిన ఆవిష్కరణలను రెండు విభాగాలుగా విభజించి ఎంపిక చేస్తారు. ఏ, బి విభాగాల్లో ఎంపికైన వారికి రూ.5లక్షల చొప్పున ప్రైజ్మణి అందించనున్నారు. ఏ విభాగంలో సాంకేతిక పరిష్కారాలు, బి-విభాగంలో దుమ్ము సేకరణ/నిరోదించే వ్యవస్థల కొరకు సాంకేతిక పరిష్కారాలు అంశంపై క్యాష్ బహుమతులను సీపీసీబీ అందించనున్నది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే సీపీసీబీ వెబ్సైట్లో పొందుపర్చిన దరఖాస్తు ఫారాలను mscb.cpcb@nic.in, techchallenge. cpcb@gov.in సైట్లకు అందించాలని కోరారు.