బంజారాహిల్స్,మే 15 : బస్తీలు, కాలనీల్లో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన పనులు పూర్తయిన వెంటనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్లను వేయించేలా ప్రణాళికలు సిద్దం చేశామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో రూ.40లక్షల వ్యయంతో చేపట్టిన డ్రైనేజీ పైప్లైన్ పనులను ఎమ్మెల్యేఆదివారం స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డితో కలిసి ప్రారంభించారు.
వెంకటేశ్వరనగర్, నందినగర్ బస్తీల పరిధిలో మురుగు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, చాలాకాలం క్రితం వేసిన లైన్ల సామర్థ్యం సరిపోకపోవడంతో కొత్తలైన్లు వేయిస్తున్నామని ఎమ్మెల్యే దానం పేర్కొన్నారు. డ్రైనేజీలైన్లు వేసిన వెంటనే ఆలస్యం చేయకుండా సీసీ రోడ్లు వేయించేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. డివిజన్ పరిధిలో సుమారు రూ.3కోట్లతో ఇప్పటికే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు పనులు పూర్తిచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, మాజీ కార్పొరేటర్ భారతీనాయక్ తదితరులు పాల్గొన్నారు.