ఘట్కేసర్, జూన్ 7: వీకెండ్ పార్టీ చేసుకుని అతివేగంతో వెళ్తుండగా కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని.. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఘట్కేసర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ పరశురాం వివరాల ప్రకారం.. హయత్నగర్ మండలం, కుంట్లూరుకు చెందిన బత్తుల భార్గవ్ యాదవ్(23), సైనిక్పురికి చెందిన చేతి వర్షిత్(22), ఓల్డ్ అల్వాల్కు చెందిన ప్రవీణ్, వైజాగ్కు చెందిన దినేశ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులు శుక్రవారం రాత్రి ఎదులాబాద్ సమీపంలోని విహారి ఫామ్హౌస్లో వీకెండ్ పార్టీ చేసుకున్నారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత క్రెటా కారు(టీఎస్ 08 హెచ్ఈ 5796)లో స్థానికంగా రోడ్లు, చెరువు వద్ద తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఎదులాబాద్ సమీపంలోని మాదారం చౌరస్తా వద్ద అతివేగంగా వెళ్తుండగా కారు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో కారు వెనుక డోర్ ఊడిపోయింది. కారులో ఉన్న భార్గవ్ యాదవ్, వర్షిత్లు కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్కు తీవ్ర గాయాలు కాగా దినేశ్కు ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.