మియాపూర్ : చదువులో మానసిక ఒత్తిడిని తట్టుకోలేక అపార్ట్మెంట్లోని 9వ అంతస్తు నుండి కిందకి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం … మై హోం జ్యువెల్ అపార్ట్మెంట్లోగత రెండు సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వీరేందర్ సింగ్ నేగి, సోనియా నేగి దంపతులకు ఇద్దరు సంతానం.
అందులో మొదటి సంతానం జహన్వి (17) సీబీఎస్సీ 12 వ తరగతి చదువుతుండగా కుమారుడు తరుణ్ 9వ తరగతి చదువుతున్నాడు. జహన్వి చదువు విషయంలో మానసిక ఒత్తిడికి గురై ఈ నెల 19న సాయంత్రం ఇంట్లో ఎవరులేని సమయం లో వారు నివాసం ఉంటున్న టార్కైస్ బ్లాక్ 9వ అంతస్తు నుండి కిందకి దూకింది. తీవ్ర రక్త గాయాలు కావడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.