కంటోన్మెంట్, డిసెంబర్ 3: సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గ్యాని లాస్యనందిత మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్లో తొలి రౌండ్ నుంచి గులాబీ పార్టీ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయకేతనం ఎగురవేసింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గ్యాని లాస్యనందిత తన సమీప ప్రత్యర్థి బీజేపీ) శ్రీ గణేష్పై 17,169 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితకు 59057 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్కు 41,888 ఓట్లు వచ్చాయి. దీంతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో రెండోసారి మహిళను అక్కున చేర్చుకుంది.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గ్యాని లాస్యనందితకు మొత్తం 59,057 ఓట్లు పోలవగా తన సమీప ప్రత్యర్థ్ధి శ్రీ గణేష్కు 41,888, కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెలకు 20,826 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో మొత్తం 2,48,723 ఓట్లకు గాను కేవలం 1,24,508 మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్కు 162, బీఆర్ఎస్కు 146, బీజేపీకి 136, చెల్లని ఓట్లు 6 వచ్చాయి.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మాట్లాడుతూ.. ఈ విజయం కంటోన్మెంట్ ప్రజలకు అంకితమని చెప్పారు. తనకు విజయాన్ని కట్టబెట్టిన కంటోన్మెంట్ ఓటర్లందరికీ శతకోటి వందనాలు తెలిపారు. అలాగే తన విజయం కోసం అహర్నిషలు కృషి చేసిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బోర్డు సభ్యులు, ఉద్యమకారులు, దివంగత ఎమ్మెల్యే సాయన్న అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆలయ కమిటీల సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు, మహిళా నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఎంఎన్ శ్రీనివాస్, కట్టెల శ్రీనివాస్ యాదవ్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు తదితర ముఖ్య నాయకులకు లాస్యనందిత కృతజ్ఞతలు చెప్పారు.