బంజారాహిల్స్,ఫిబ్రవరి 7: జూబ్లీహిల్స్లోని నందగిరిహిల్స్లో వ్యాపారి నివాసంలో చోరీకి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ను పట్టుకునేందుకు పోలీసుల వేట కొనసాగుతున్నది. ఫార్చ్యూన్ ఫోమ్స్ సంస్థ యజమాని రవీ్రందకుమార్ శర్మ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన చోరీ కేసులో ప్రధాన నిందితుడైన భూపేందర్ సాహా అలియాస్ భువన్ ముఠా పక్కా ప్రణాళికతో లక్షలాది రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను చోరీ చేసి ఉడాయించిన సంగతి తెలిసిందే. యజమానులు ఫంక్షన్ కోసం బయటకు వెళ్లి వస్తారనే ముందస్తు సమాచారంతో భూపేందర్ తన స్నేహితులను పిలిపించి జన్మదినం పేరుతో ఇంట్లోని వాచ్మెన్తో సహా ముగ్గురికి మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చినట్లు తేలింది. అయితే సీసీ కెమెరాలకు చిక్కకుండా నందగిరి హిల్స్ నుంచి ప్రధాన రోడ్లపై కాకుండా అంతర్గత రోడ్లపై నుంచి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లతోపాటు ఇతర ప్రాంతాల్లో పోలీసులు నిందితుల కోసం గాలింపు చేస్తున్నారు. కాగా, భూపేందర్ను పనిలో కుదిర్చిన మదన్ అనే ఏజెంట్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడిది నేపాల్లోని దాయ్లేక్ మున్సిపాల్టీలోని అతిభిషన్ అనే ప్రాంతంగా గుర్తించారు. చోరీ చేసిన అనంతరం బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు నేపాల్ సరిహద్దు ప్రాంతంలో కాపు కాశారు. కోల్కతా, గోరఖ్పూర్తో పాటు మహారాష్ట్రలోని పుణె ప్రాంతంలో తెలిసినవారి ఇండ్లకు వెళ్లే అవకాశం ఉండటంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించారు. ఒకటి రెండురోజుల్లో నిందితులను పట్టుకునే అవకాశం ఉందని పోలీసులు దీమా వ్యక్తం చేస్తున్నారు.