హైదరాబాద్ : విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతి ఇవ్వకపోవడంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ తర్వాత బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని సాంకేతిక ఆధారాలతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. దీంతో సీఐఎస్ఎఫ్, శంషాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఈ మేరకు ఫోన్ చేసిన ఆగంతకుడి ఆరా తీయగా.. భద్రయ్య అనే వ్యక్తి ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. విమానంలో బాంబు ఉందని బెదిరింపులకు పాల్పడినందుకు అతన్ని అరెస్టు చేశారు. వాస్తవానికి భద్రయ్య హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉన్నది. విమానాశ్రయానికి భద్రయ్య ఆలస్యంగా రావడంతో సిబ్బంది విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతించలేదు. దాంతో డయల్ 100కు ఫోన్ చేసి బాంబు ఉందని బెదిరించినట్లు గుర్తించారు. ఈ మేరకు సాంకేతిక ఆధారాలతో సాంకేతిక ఆధారాలతో భద్రయ్యను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.