బోడుప్పల్, నవంబర్25 : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశంలో మౌలిక వసతులకు పెద్దపీట వేశారు. శుక్రవారం మేయర్ సామల బుచ్చిరెడ్డి అధ్యక్షతన, కమిషనర్ పద్మజరాణి సమక్షంలో సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో మౌలిక వసతుల కల్పనకు కార్పొరేటర్లు అధిక ప్రాధాన్యత కల్పించారు. ఇటీవల కురిసిన వర్షాలకు వివిధ డివిజన్లలో ఏర్పడిన గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కౌన్సిల్ సభ్యులు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
వసతుల కల్పనకు పెద్దపీట..
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.5లక్షలు, సీసీరోడ్లు ప్యాచ్వర్క్కు రూ.15లక్షలు, బీటీరోడ్డు ప్యాచ్ వర్క్కు రూ.20లక్షలు, శానిటేషన్ పనులకు రూ.లక్ష, డోజర్కు రూ.2లక్షలు, డ్రైనేజీ మరమ్మతులకు రూ.10లక్షలు కేటాయించారు. రూ.5భోజన నిర్వహణ సరిగా లేనందున సదరు కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన రూ.24లక్షల బిల్లుల చెల్లింపులను వాయిదా వేశారు.
రూ.40 లక్షలతో నూతన నర్సరీల ఏర్పాటు..
బోడుప్పల్ నగరాన్ని హరితనగరంగా తీర్చిదిద్దేందుకు రూ.40లక్షలతో నూతన నర్సరీల ఏర్పాటుకు కౌన్సిల్ సమావేశంలో ఏకీగ్రీవంగా ఆమోదించారు. హరితహారానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ రూ.40లక్షలు కేటాయించారు. పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, వసతుల కల్పనకు రూ.15లక్షలు, రూ.5లక్షలు సింటెక్స్ వాటర్ ట్యాంకుల ఏర్పాటుకు రూ.5లక్షలు నిధులు కేటాయించారు. ఆయా డివిజన్లలోని విద్యుత్ సమస్య పరిష్కారానికి రూ.50లక్షలు కేటాయించారు.
బిల్ కలెక్టర్ల హ్యాండ్ మిషన్లకు రూ.15లక్షలు, రెడ్డి కాలనీ డ్రైనేజీకి రూ.9.30లక్షలు కేటాయించారు. 2వ డివిజన్ ఇందిరానగర్ బస్తీ దవాఖానకు రూ.6లక్షలు, 23వ డివిజన్ అంబేద్కర్ నగర్ బస్తీ దవాఖానకు రూ.5లక్షలు కేటాయించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహణ కోసం రూ.10లక్షలు కేటాయిస్తూ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించారు. కార్యక్రమంలో కమిషనర్ పద్మజారాణి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.