సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తలసీమియా వ్యాధిగ్రస్తులు, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారితోపాటు వివిధ శస్త్రచికిత్సలు, గర్భిణులకు ప్రసవ సమయాల్లో రక్తం అత్యవసరం. సకాలంలో రక్తం అందించకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఇంతటి విలువైన రక్తాన్ని దానం చేసేందుకు ఇప్పటికీ చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ప్రతి దవాఖానలో ఐపీ సేవలు పొందుతున్న వారిలో 7 నుంచి 10 శాతం మందికి రక్తం అవసరం పడుతుంది. కరోనా నేపథ్యంలో దవాఖానల్లో ఐపీ రోగుల సంఖ్య కొంత తగ్గడం వల్ల రక్తం వినియోగం కూడా తగ్గింది. ఇదే సమయంలో రక్తదాతల సంఖ్య భారీగా పడిపోయింది.
ప్రధాన కారణం అనేకమంది కరోనా బారిన పడి అనారోగ్యం పాలవడం, లాక్డౌన్తో బయటకు రాలేకపోవడం, పాజిటివ్ వస్తే రక్తం ఇవ్వొచ్చో లేదో, టీకా తీసుకున్నవారు రక్తదానం చేయవచ్చో లేదోననే అనుమానాలు పెరిగి దూరంగా ఉంటున్నారు. దీన్ని ముందుగానే ఊహించిన ఐపీఎం పరిధిలోని ఎన్హెచ్ఎం బ్లడ్ సెల్ అధికారులు కరోనా సమయంలోనూ బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. దాతలు బయటకొచ్చి రక్తదానం చేసే పరిస్థితులు లేనందున అధికారులే దాతల వద్దకు వెళ్లి రక్త సేకరణ చేస్తున్నారు.
ఎన్హెచ్ఎం బ్లడ్ సెల్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న బ్లడ్ డొనేషన్ క్యాంపులు ప్రారంభించినట్లు వీబీడీ (వాలంటరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్) ఇన్చార్జ్ డాక్టర్ అనిల్ తెలిపారు. ఐపీఎంలో ఉన్న మూడు వ్యాన్ల ద్వారా పోలీసులు, ఇతర ప్రభుత్వ సంస్థలు, సేవాభారతి వంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా 62 క్యాంపులు నిర్వహించి మొత్తం 3177 యూనిట్ల బ్లడ్ సేకరించినట్లు చెప్పారు. సేకరించిన 3177 యూనిట్ల రక్తం నుంచి 4917 యూనిట్ల కాంపొనెంట్స్ తయారు చేసి వివిధ ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అందించారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారు కూడా నెలరోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు. కరోనా టీకా తీసుకున్న వారు సైతం నెల తర్వాతే రక్తదానం చేయాలి. కరోనా సమయంలో నిల్వలు పడిపోకుండా ఎప్పటికప్పుడు ఎన్హెచ్ఎం బ్లడ్ సెల్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. ఏప్రిల్ 19 నుంచి ఇప్పటివరకు 62 క్యాంపులు నిర్వహించి 3177 యూనిట్ల రక్తం సేకరించాం. -డాక్టర్ అనిల్, విబిడి ఇన్చార్జ్, ఎన్హెచ్ఎం బ్లడ్సెల్, ఐపీఎం