వెంగళరావునగర్, డిసెంబర్ 18: మాయమాటలు నమ్మి, వేధింపులకు గురైన వేర్వేరు ప్రాంతాల్లోని ముగ్గురు యువతులు మోసపోయారు. వారిని నమ్మించి, బ్లాక్ మెయిల్ చేసిన నేరగాళ్లు డబ్బు, బంగారు నగలు కాజేశారు. నేరగాళ్ల వేధింపులు ఇంకా పెరగడంతో బాధితురాళ్లు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డలోని ఓ మహిళా కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థిని (22) గత జనవరిలో కళాశాలలో నిర్వహించిన ప్రాక్టికల్ తరగతులకు హాజరైంది.
ఆ సమయంలో నార్సింగికి చెందిన మహబూబ్ అలియాస్ హేమంత్ (27) ప్రేమిస్తున్నానని, పెండ్లి కూడా చేసుకుంటానని వెంటపడ్డాడు. మొబైల్ ఫోన్ ద్వారా ఆమె ఫొటోలను రహస్యంగా తీసి.. నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. ఆ తర్వాత తనకు రూ.3 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబ సభ్యులకు కూడా పంపుతానని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు రూ.3 లక్షలు మహబూబ్కు ఇచ్చింది. ఆమె వద్ద ఉన్న నగలు కూడా కావాలని డిమాండ్ చేశాడు. బెదిరింపులకు లొంగిన బాధితురాలు నాలుగు తులాల బంగారు నగలు కూడా ఇచ్చింది. ఇటీవల ఆమె వద్ద ఉండే నగలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. అసలు విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
బ్యూటిషియన్ వద్ద రూ.8 లక్షలు స్వాహా
బ్యూటిషియన్గా పనిచేస్తున్న యువతిని మోసం చేసి రూ.8 లక్షలు స్వాహా చేసిన వ్యక్తిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ యువతి (23)బ్యూటిషియన్గా పనిచేస్తూ ఎస్ఆర్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్నది. ఆమెకు నాలుగేండ్ల కిందట కోదాడకు చెందిన కంభంపాటి రాజేంద్రబాబు(27) పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెండ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. బాధితురాలికి మాయమాటలు చెప్పి రూ.8 లక్షలు తీసుకుని జల్సాలకు వాడుకున్నాడు. పెండ్లి విషయాన్ని ప్రస్తావించగా.. ప్లేటు ఫిరాయించి తప్పించుకుని తిరుగుతున్నాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేంద్రబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
ప్రేమ పేరుతో వేధింపులు..
బీకే గూడలోని ఓ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని(23)్ర పైవేట్లో ఉద్యోగం చేస్తున్నది. ఆమెను గత ఎనిమిది నెలలుగా సూర్యపేటకు చెందిన సుదాల సునీల్ (26) వేధిస్తున్నాడు. వేర్వేరు నంబర్లతో ఫోన్ చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక బాధితురాలు అతడి ఫోన్ నంబర్లను బ్లాక్ చేసింది. అయినప్పటికీ వెంటపడుతూనే ఉన్నాడు. భయపడిన బాధితురాలు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.