దుండిగల్, ఏప్రిల్ 14 : ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందగా, మరో విద్యార్థికి తీవ్ర గాయాలైన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్లోని పద్మానగర్కు చెందిన మార్కనర్సయ్య పెద్దకొడుకు ప్రణయ్(20), నగర శివారు దుండిగల్లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే గురువారం రాత్రి తన స్నేహితుడు, సహచర విద్యార్థి అఖిల్సాయితో కలిసి ద్విచక్ర వాహనంపై గండిమైసమ్మ చౌరస్తా వైపు నుంచి బహదూర్పల్లి వైపునకు వేగంగా వెళ్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున 1:30 గంటల సమయంలో బహదూర్పల్లిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో స్నేహితులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అఖిల్సాయి కాళ్లకు తీవ్రగాయాలు కాగా, వెనుక కూర్చున్న ప్రణయ్ ఎగిరి డివైడర్పై పడటంతో ముఖం, చాతిపై బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి నారాయణ వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ ప్రణయ్ మృతి చెందాడు. హెల్మెట్ పెట్టుకొని ఉంటే ప్రణయ్ ప్రాణాలతో బయటపడేవాడు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.