హిమాయత్నగర్, మే 20: ప్రముఖ సంఘ సంస్కర్త, దళితజాతి విద్యావికాసానికి మాదరి భాగ్యరెడ్డి వర్మ కృషి చేశారని పలువురు పేర్కొన్నారు. భాగ్యరెడ్డి వర్మ 135వ జయంతి వేడుకలను ఈ నెల 22న రవీంద్రభారతిలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుందని ఆది- హిందూ సోషల్ సర్వీస్లీగ్ తెలిపింది. జయంతికి సంబంధించిన బ్రోచర్ను శనివారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ బీఎన్ జ్ఞాన ప్రకాశ్, లీగ్ కార్యదర్శి మాదరి అజయ్గౌతమ్, ఉపాధ్యక్షుడు డి.బాలనరసింహ మాట్లాడుతూ… భాగ్యరెడ్డి వర్మ జీవితమంతా దళితుల అభ్యున్నతికి కృషి చేశారని, జోగిని, దేవదాసి వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారని గుర్తు చేశారు. భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా 2023కి గాను ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అధ్యక్షుడు జి.మురళీధర్ రావుకు భాగ్యరెడ్డి వర్మ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
ఈ వేడుకలకు సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి, శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్గౌడ్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, డాక్టర్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ యం.ఎస్ ప్రభాకర్రావు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో లీగ్ ఉపాధ్యక్షుడు బి.సత్య నారాయణ రావు, సహాయ కార్యదర్శి మాదరి శ్రీలతాగౌతమ్, నాయకులు పి.యాదగిరి, కె.ఆర్ ఘన్శ్యాం, ప్రొఫెసర్ జైకిషన్ పాల్గొన్నారు.