మెహిదీపట్నం ఆగస్టు 20: ఆన్లైన్, ఆఫ్లైన్లో పకడ్బందీగా బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఓ ముఠాను శుక్రవారం నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం లంగర్హౌస్ పోలీసులకు అప్పగించారు. ఏడుగురు సభ్యుల ముఠాలో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి రూ. 8.65 లక్షల నగదు, కారు, లాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తెలిపిన వివరాల ప్రకారం…బహదూర్పురా వట్టేపల్లికి చెందిన సయ్యద్ జమీల్(28), అజహరుద్దీన్(35), సయ్యద్ జహీరుద్దీన్(32), కుల్సుంపురా ముస్తయిద్పురాకు చెందిన ఖాజా ఆసిమ్ అహ్మద్(28), టోలిచౌకి అహ్మద్ కాలనీకి చెందిన మహ్మద్ షెహబాజ్(29), రాజేంద్రనగర్ కిషన్బాగ్కు చెందిన ఆజంఖాన్(23), మల్లేపల్లికి చెందిన తాహుద్దీన్లు ముఠాగా ఏర్పడి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో తమ వెబ్సైట్తో బెట్టింగ్ ఆడే వారికి ప్రత్యేకంగా ఐడీలను సైతం అందజేశారు. లంగర్హౌస్ పోలీస్స్టేషన్ పరిధిలోని అహ్మద్ కాలనీ కేంద్రంగా ఈ దందా సాగుతున్నది. సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు, ఎస్ఐలు శ్రీకాంత్, అశోక్రెడ్డి, శివానందం బృందం దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. అజహరుద్దీన్, జహీరుద్దీన్, తాహుద్దీన్లు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.