బంజారాహిల్స్, సెప్టెంబర్ 14: బెంగళూరు నగరంలో సూడో పోలీసుగా చెలామణి అవుతూ.. అనేక కిడ్నాప్ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని జూబ్లీహిల్స్లో సినీ ఫక్కీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం జూబ్లీహిల్స్ క్లబ్ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డుపై పరుగు తీస్తుండగా నలుగురు వ్యక్తులు వెంబడించారు. కొంతదూరం వెళ్లాక సదరు వ్యక్తిని పట్టుకొని కారులోకి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేపింది. దీనిపై స్థానికులు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో అక్కడకు చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు విషయం తెలుసుకున్నారు. కారులో వచ్చింది బెంగళూరు పోలీసులని, అక్కడ కిడ్నాప్ ముఠాను నడిపిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు. ఆరా తీయగా.. కూకట్పల్లికి చెందిన సత్యనారాయణరాజు అలియాస్ సుధాకర్రెడ్డి(41) బెంగళూరుకు వెళ్లి అక్కడ ఇంటలిజెన్స్ పోలీసుగా బోగస్ ఐడీ కార్డు తయారు చేయించుకున్నాడు. సంపన్నులను కిడ్నాప్ చేయడం, వారి వీడియోలు తీసి డబ్బులు లాగడం వృత్తిగా పెట్టుకున్నాడు. మరో నలుగురితో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేశాడు. గత కొంతకాలంగా సుమారు రూ.6కోట్ల మేర డబ్బులు వసూలు చేశాడు. అతడిపై 15కు పైగా కేసులు నమోదు కావడంతో అక్కడి నుంచి పారిపోయి నగరానికి వచ్చాడు. కాగా, బెంగళూరులోని బెట్రాయన్పూర్ పోలీస్స్టేషన్లో నమోదైన ఓ కేసులో అతడి అనుచరులను అరెస్ట్ చేయగా.. సత్యనారాయణ రాజు వ్యవహారం బయటపడింది. దీంతో బుధవారం బెంగళూరు పోలీసులు ఇక్కడకు వచ్చి అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో తప్పించుకొని పరుగు తీశాడు. వెంబడించి పట్టుకోవడంతో కిడ్నాప్గా భావించారు. విషయం తెలియడంతో ఊపిరిపీల్చుకున్నారు.